Breaking News: లెక్చరర్ అవమానించడంతో ఇంటర్‌ విద్యార్థి(434/440) ఆత్మహత్య..

గద్వాల, ఏపీబీ న్యూస్: ఉపాధ్యాయుల వేధింపులు, తరగతి గదిలో జరిగిన తీవ్ర అవమానం తాళలేక ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి ప్రాణాలు తీసుకున్న దారుణ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న నేతిబొట్టు తరుణ్ (17) అనే విద్యార్థి, మహిళా లెక్చరర్ ప్రవర్తనతో మనస్తాపం చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కొత్తపల్లి గ్రామానికి చెందిన తరుణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లా స్థాయిలోనే ద్వితీయ స్థానంలో నిలిచాడు. కాగా, కాలేజీలో 435 మార్కులు వచ్చిన మరో విద్యార్థితో పోలుస్తూ ఓ మహిళా లెక్చరర్ తరుణ్ను తరగతి గదిలో “434 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా! నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఉన్నారు” అని తీవ్రంగా కించపరిచారు. అలా అందరి ముందు అవమానించడం సరికాదని, తనను తక్కువ చేసి మాట్లాడవద్దని తరుణ్ లెక్చరర్ను విజ్ఞప్తి చేశాడు.

తరుణ్ ఎదురు చెప్పాడనే ఆగ్రహంతో సదరు మహిళా లెక్చరర్ “నువ్వేమైనా మంత్రి కొడుకువా? అంతకంటే గొప్పోడివా?” అంటూ విద్యార్థులందరి ముందూ తరుణ్ చెంపపై కొట్టి తీవ్రంగా అవమానించారు. లెక్చరర్ చర్యతో క్లాస్లోని మిగతా విద్యార్థులు నవ్వడంతో తరుణ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనస్తాపంతో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.

ప్రోత్సహించాలి – కించపరచకూడదు: “ఉపాధ్యాయులు విద్యార్థులను ఎప్పుడూ ప్రోత్సహించేలా ఉండాలి కానీ, ఇలా అందరి ముందు కించపరచకూడదు.”

సున్నిత మనస్కుల బాధ: “ఒక్క సున్నిత మనస్కుడికి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆ లెక్చరర్కు తెలియాలి.”

కఠిన చర్యలకు డిమాండ్: “నా చావుకు కారణమైన ఆ మహిళా లెక్చరర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సమాజంలో అందరికీ ఈ విషయం తెలియాలనే నేను ఇలా చేస్తున్నాను.”

ప్రతిభావంతుడైన విద్యార్థి లెక్చరర్ ప్రవర్తన వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తరుణ్ రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా సదరు మహిళా లెక్చరర్పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Share
Share