Breaking News: డ్యూటీలో లంచం తీసుకుంటూ దొరికి.. ఏసీబీని చూసి పరుగు..

హైదరాబాద్ / కీసర, ఏపీబీ న్యూస్: రాజధాని నగర శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఏసీబీ (ACB) దాడి కలకలం రేపింది. రేషన్ బియ్యం కేసులో బెయిల్ ఇప్పించేందుకు బాధితుల నుంచి ఏకంగా రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ కీసర ఇన్స్పెక్టర్ (సీఐ) అంజనేయులు, సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.

ఈ క్రమంలో ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ పరుగులు తీయడం, కెమికల్ టెస్టులకు సహకరించకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పోలీసు వర్గాలు, ఏసీబీ ఆధారాల ప్రకారం.. ఇటీవల నమోదు అయిన రేషన్ బియ్యం కేసులో బెయిల్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు మరియు కేసు తీవ్రత తగ్గించేందుకు కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిలు నిందితుల నుంచి రూ. 10 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా, గత కొంతకాలంగా బాధితులచే ఉచితంగా తమ వ్యక్తిగత పనులు చేయించుకోవడమే కాకుండా, రోజూ బిర్యానీలు, కూల్ డ్రింక్స్ తీసుకురావాలని తీవ్రంగా వేధించేవారు.

ఈ వేధింపులు తట్టుకోలేక బాధితుడు చివరకు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదుతో పథకం ప్రకారం ఏసీబీ అధికారులు కీసర పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. గురువారం కీసర చెరువు వద్ద వినాయక నిమజ్జనం బందోబస్తు డ్యూటీలో ఉన్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి, బాధితుడి నుంచి కారులో రూ. 5 లక్షల లంచం నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం దాడి చేసింది.

ఏసీబీని చూసి పరుగులు: ఏసీబీ అధికారులు చుట్టుముట్టడాన్ని గమనించిన ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి లంచం డబ్బులతో అక్కడికక్కడే పరుగు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఏసీబీ సిబ్బంది ఆయనను వెంటాడి పట్టుకున్నారు.

కెమికల్ టెస్టులకు నిరాకరణ: అరెస్ట్ చేసిన అనంతరం చేతికి కెమికల్ (Phenolphthalein) టెస్టులు చేస్తుంటే ఇటు ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి, అటు సీఐ అంజనేయులు ఏసీబీ అధికారులకు సహకరించకుండా ముప్పుతిప్పలు పెట్టారు.

కేసు నమోదు: ఏసీబీ అధికారులు ఇద్దరు అధికారుల నుంచి రూ. 5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే నిమజ్జనం డ్యూటీలో ఉంటూ ఇలా భారీగా లంచం తీసుకుంటూ పట్టుబడటం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది.

Share
Share