- నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం..
- మగపిల్లవాడు పుట్టలేదని అత్తింటి వేధింపులు..
- నల్గొండ ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు వదిలిన మమత
నల్గొండ, ఏపీబీ న్యూస్: వరుసగా నాలుగోసారి కూడా ఆడపిల్లే జన్మించిందనే నెపంతో అత్తింటివారు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన ఓ బాలింత దారుణ నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘోర ఉదంతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఘటన వివరాలు & బాధితుల ఫిర్యాదు:
బాధితురాలి వివరాలు: నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన మమత అనే మహిళ వారం రోజుల క్రితం ప్రసవం నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమెకు నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్ల జన్మించింది.
అత్తింటి వేధింపులు: వరుసగా నలుగురు ఆడపిల్లలే పుట్టడంతో కుటుంబంలో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. మగపిల్లవాడికి జన్మనివ్వలేదనే నెపంతో అత్తమామలు, భర్త తరఫు బంధువులు మమతను మానసికంగా, శారీరకంగా తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు బంధువులు తెలిపారు.
ఆస్పత్రి ఆవరణలోనే సూసైడ్:
అత్తింటి వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన మమత, ఆసుపత్రి ఆవరణలోని ఒక చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఉదయం గమనించిన రోగుల బంధువులు, సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నల్గొండ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మమత మృతికి అత్తింటివారి వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.