Breaking News: Video.. మనవడి కోసం వెళ్లి.. బోరు గుంత లో ఊపిరి ఆడక తాత కన్నుమూత..

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: అజాగ్రత్తగా వదిలేసిన బోరు బావులు మరోసారి ప్రాణాలను బలితీసుకున్నాయి. మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి శివారులో జరిగిన ఈ ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

యాదగిరిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వెంకన్న (53) తన నాలుగేళ్ల మనవడితో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు పొలంలో తెరిచి ఉన్న బోరు గుంతలో పడిపోయాడు. మనవడు లోపలికి పడిపోవడాన్ని గమనించిన వెంకన్న, ఎలాగైనా కాపాడాలనే ఆరాటంతో వెంటనే ఆ గుంతలోకి చేయి వేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో వెంకన్న కూడా అదే బోరు గుంతలో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

పోలీసులు అతి కష్టం మీద బోరు గుంతలోంచి తాత, మనవడిని బయటకు తీశారు. బాలుడు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడగా, వెంకన్న మాత్రం సుమారు గంటకు పైగా లోపల ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన వెంకన్న ఉదంతం గ్రామస్తులను కలచివేస్తోంది. అయితే, ఉపయోగంలో లేని బోరు బావులను పూడ్చివేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని, భూ యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Share
Share