Breaking News: హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ హత్యకు కుట్ర?.. కాంగ్రెస్ నేత పై ఫిర్యాదు

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే వార్త ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్య కుట్ర వెనుక యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని బుడ్డ సత్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు.

ఈ రోజు ఉదయం మన్సూరాబాద్లోని సత్యనారాయణ నిర్వహిస్తున్న రేషన్ షాప్ ముందర నలుగురు యువకులు సుమారు గంటసేపు అనుమానాస్పదంగా తిరుగుతూ రెక్కి నిర్వహించారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు, సత్యనారాయణ వర్గీయులు ఆ యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించగా ముగ్గురు పారిపోగా, ఒక్కరిని స్థానికులు సమర్థవంతంగా చాకచక్యంగా పట్టుకొని ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు.

పట్టుబడిన యువకుడి వివరాలు: స్థానికులకు పట్టుబడిన యువకుడిని గార్లపాటి అరవింద్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

విచారణలో షాకింగ్ నిజాలు: పోలీసుల విచారణలో అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. తమను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి పంపించాడని ఒప్పుకున్నట్లు సత్యనారాయణ తెలిపారు.

పాత పగలే కారణం: కొంతకాలంగా బుడ్డ సత్యనారాయణకు, జక్కిడి శివ చరణ్ రెడ్డి మరియు ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డిలకు తీవ్ర వివాదం నడుస్తోంది. గతంలో ప్రభాకర్ రెడ్డిపై సత్యనారాయణ ఎస్సీ, ఎస్టీ (SC/ST) కేసు నమోదు చేయడంతో వారు ఆయనపై తీవ్ర కోపంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.

ఈ దారుణ ఘటనపై బుడ్డ సత్యనారాయణ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో జక్కిడి శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.

తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే భావనతో బుడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ.. తక్షణమే జక్కిడి శివ చరణ్ రెడ్డిని, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని మరియు శివ చరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

Share
Share