Breaking News: ఆయుధాల చోరీ కేసు లో.. ముగ్గురు ఆర్మీ అధికారులు అరెస్ట్..

సికింద్రాబాద్, ఏపీబీ న్యూస్: సికింద్రాబాద్లోని ప్రతిష్టాత్మక మద్రాస్ రెజిమెంట్ సైనిక స్థావరంలో చోటుచేసుకున్న ఆయుధాల చోరీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత నెల 30వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈ సంచలనాత్మక కేసులో పురోగతి సాధించిన ఆర్మీ వర్గాలు.. ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నాయి. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

ఈ ఆయుధాల చోరీ కేవలం ఒక్క రోజులో జరిగింది కాదని, గత మూడు నెలలుగా పథకం ప్రకారం ఒక్కో ఆయుధాన్ని మాయం చేస్తూ వచ్చినట్లు మిలిటరీ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

సిసిటీవీ కెమెరాలు ఆఫ్: ఆయుధాగారం (అర్మరీ) వద్ద ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీటీవీ కెమెరాలను నిలిపివేసేవారు.

గార్డుల డైవర్షన్: డ్యూటీలో ఉండే సెక్యూరిటీ గార్డులను వేర్వేరు పనులపై బయటకు పంపించి, ఆ సమయంలోనే ఆయుధాలను గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశారు.

దొంగతనం డ్రామా: ఈ వ్యవహారాన్ని బయటి దొంగల పనిగా చిత్రీకరించేందుకు ఘటన జరిగిన రోజున ఉద్దేశపూర్వకంగానే ఆయుధాగారం తాళాలు పగలగొట్టి హైడ్రామా ఆడారు.

సైనిక బలగాల్లోని ఉన్నతాధికారులే నేరుగా ఈ చోరీకి పాల్పడ్డారా? లేక విధులు నిర్వహించే ‘అగ్నివీర్’ సైనికులను బెదిరించి ఈ పనులకు ఒత్తిడి తెచ్చారా? అన్న కోణాల్లో అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు.

అంతేకాకుండా చోరీ చేసిన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను ఎవరి కోసం దొంగిలించారు? దీని వెనుక ఏవైనా ఉగ్రవాద సంస్థల హస్తం లేదా దేశభద్రతకు ముప్పు కలిగించే పెద్ద కుట్ర ఉందా? అనే కోణంలో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ (Defense Intelligence) మరియు మిలిటరీ పోలీసులు (Military Police) సంయుక్తంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

Share
Share