Breaking News:బూత్ స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల్లో ఓటమి ఖాయం..: మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: “మనం ఇక్కడికి వచ్చింది కేవలం ఒక సాధారణ సమావేశం కోసం కాదు.. రాబోయే రాజకీయ పోరాటానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రతి ఓటరును కాపాడుకునే యుద్ధానికి సిద్ధం కావడానికి” అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం ఈ ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు.

బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఓట్లను, సీట్లను ఎలా చోరీ చేస్తుందో వివరించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాతీయస్థాయి గణాంకాలను సదస్సులో ప్రస్తావించారు.

భారీగా ఓట్ల తొలగింపు: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ (SIR) ద్వారా ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్లు, పశ్చిమ బెంగాల్లో 91 లక్షలు, తమిళనాడులో 74 లక్షలు, గుజరాత్లో 68 లక్షలు, మధ్యప్రదేశ్లో 34 లక్షల ఓట్లను తొలగించారని వివరించారు.

ఓటమికి కారణమైన నిర్లక్ష్యం: తమిళనాడులో సీఎం స్టాలిన్ పోటీ చేసిన స్థానంలో ఏకంగా 71 వేల ఓట్లు తొలగిస్తే.. ఆయన కేవలం 8 వేల ఓట్లతోనే ఓడిపోయారని గుర్తుచేశారు. అలాగే బెంగాల్లో మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 44 వేల ఓట్లు తీసేయడం వల్లే ఆమె 15 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని విశ్లేషించారు. తమిళనాడులో స్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడానికి అక్కడ జరిగిన 74 లక్షల ఓట్ల తొలగింపే కారణమన్నారు. దీన్ని బట్టి బూత్ స్థాయిలో జరిగే నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదకరమో అర్థం చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారిపై వస్తున్న వివాదాలపై మంత్రి స్పందించారు. తమిళనాడులో పుట్టి, మధ్యప్రదేశ్లో లోక్సభ సభ్యురాలిగా గెలిచిన ఆమె ఎంతో నిరాడంబరమైన జీవితం గడుపుతారని, పేదల పక్షాన నిలబడే నిబద్ధత గల లీడర్ అని కొనియాడారు. బీజేపీకి కనీస బలం లేని చోట్ల కూడా మూడో అభ్యర్థిని నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, అందులో భాగమే ఇలాంటి కుట్రలని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు, రైతులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల్లో తిరుగులేని విశ్వాసం సంపాదించుకుందని మంత్రి తెలిపారు. అయితే ప్రజల మద్దతు ఓటుగా మారాలంటే ఓటర్ల లిస్ట్లో వారి పేర్లు భద్రంగా ఉండాలన్నారు.

కార్యాచరణ గడువు: జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఇంటింటి ఓటర్ల గణనను అత్యంత సీరియస్గా తీసుకోవాలని ఆదేశించారు. జూలై 31న ముసాయిదా జాబితా వచ్చిన తర్వాత ప్రతి బూత్ ఏజెంట్ తన పరిధిలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయాలన్నారు.

సిద్ధాంతం: “ఎన్నికల్లో ఓటమి ఎప్పుడూ పోలింగ్ రోజు ప్రారంభం కాదు.. బూత్ స్థాయిలో నిర్లక్ష్యం జరిగిన రోజే ప్రారంభమవుతుంది” అనే విషయాన్ని గుర్తుంచుకుని, అర్హులైన ఒక్క పేదవాడి, యువకుడి ఓటు కూడా జాబితా నుండి తొలగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపైనే ఉందన్నారు. నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ కోటగా ఉన్న ప్రత్యేక చరిత్రను కాపాడుతూ ప్రతి బూత్లో యుద్ధ ప్రాతిపదికన పని ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

Share
Share