Breaking News: సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ..

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) వేడుకలు కోలాహలంగా సాగాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు రాఖీ ని కట్టడం విశేషం.

రాఖీ కట్టిన అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మూడోసారి బంగారు రాఖీ: “సీఎం రేవంత్ రెడ్డికి ఇది వరుసగా మూడోసారి రాఖీ కట్టడం. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బంగారు రాఖీని ఈ రోజు కట్టాను. సీఎంతో పాటు ఆయన అల్లుడికి, మనవడికి కూడా రాఖీలు కట్టాను” అని వెల్లడించారు.

“నేను రాష్ట్రంలోని అందరి ఆడపడుచును. నన్ను ఎవరూ వేరు చేసి చూడకండి. తెలంగాణ ఆడపడుచులపై సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఆయనకు మహిళల అండ దండలు నిరంతరం ఉంటాయి” అని స్పష్టం చేశారు.

అభివృద్ధికి శక్తినివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.రాజకీయ కామెంట్స్పై స్పందన: పండుగ వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని, పవిత్రమైన రోజున శుభాకాంక్షలు మాత్రమే తెలుపుతున్నానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Share
Share