Breaking News: నల్లగొండ: ఇబ్రహీంపేట జంట హత్యల కేసు ఛేదింపు.. ఐదుగురు నిందితుల అరెస్ట్, ముగ్గురు పరారీ..

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో జరిగిన రుద్రాక్షి సుమలత (45), ఆమె కుమార్తె రుద్రాక్షి లావణ్య (23)ల జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ దారుణ ఘాతుకం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

నేపథ్యం: మృతురాలు లావణ్య పేరు మీద ఉన్న 5.24 ఎకరాల భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని నిందితులు పక్కా వ్యూహం రచించారు. కుటుంబంలో ఉన్న ఆస్తి పంపకాల విభేదాలు ఈ దారుణానికి దారితీశాయి.

ఘాతుకం జరిగిందిలా: ఈ నెల 17వ తేదీ ఉదయం సుమలత, లావణ్యలు ఇబ్రహీంపేట్ గ్రామ శివారులోని పామాయిల్ తోటకు వెళ్లగా నిందితులు వారిని వెంబడించారు. హఠాత్తుగా వారిపై దాడి చేసి, కళ్లల్లో కారం పొడి చల్లి, ఊపిరి ఆడకుండా చున్నీలతో గొంతు బిగించి కిరాతకంగా చంపేశారు.

హత్య అనంతరం పరారైన నిందితుల కోసం హాలియా పోలీసులు సాంకేతిక ఆధారాలు, సెల్ఫోన్ లొకేషన్ల ద్వారా గాలించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు: గుర్రం నవనీత, అంగడి రేణుక, గుండ్లపల్లి స్వామి, గుర్రం రమేశ్, రుద్రాక్షి మహేశ్.

స్వాధీనం చేసుకున్నవి: నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన ఒక ఎరుపు రంగు ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్ (AP24AM8012), 3 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

పరారీలో ముగ్గురు: ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది పాల్గొనగా, ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ సీఐ బి. శ్రీను నాయక్ పర్యవేక్షణలో త్రిపురారం ఎస్ఐ కె. నరేశ్, హాలియా ఎస్ఐ బి. సాయి ప్రశాంత్, క్లూస్ టీం సభ్యులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

భూమి కోసం, ఆస్తి కోసం సొంత బంధువులే కన్నవారిని కడతేర్చడం నైతిక విలువల పతనానికి అద్దం పడుతోంది. నడిరోడ్డుపై కాకుండా పొలాల వద్ద ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్న నేరగాళ్లకు చట్టం ద్వారా కఠినమైన శిక్ష పడినప్పుడే ఇటువంటి ఘాతుకాలకు అడ్డుకట్ట పడుతుందని ‘ఏపీబీ న్యూస్’ అభిప్రాయపడుతోంది.

Share
Share