Breaking News: బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. మెడికవర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.

గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరిన శకుంతలమ్మకు వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించారు. గుండెలో రక్త ప్రసరణకు ఆటంకం కలగడంతో, కార్డియాలజిస్టుల బృందం ఆమెకు వెంటనే స్టంట్ వేసి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

మంత్రి పరామర్శ: తల్లి అస్వస్థత వార్త విన్న వెంటనే బండి సంజయ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న అమ్మను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి, అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

శస్త్రచికిత్స అనంతరం శకుంతలమ్మ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉన్నట్లు సమాచారం. అయితే, వయస్సు రీత్యా మరికొన్ని గంటల పాటు ఆమెను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బండి సంజయ్ తల్లి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నేతలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

గుండెపోటు వచ్చిన సమయంలో ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి చేర్చడం వల్ల శకుంతలమ్మకు ప్రాణాపాయం తప్పింది. సరైన సమయంలో వైద్యులు స్టంట్ వేయడంతో ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు.

Share
Share