Breaking News: కృష్ణా జలాల కోసం సమర శంఖం..

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు, కృష్ణా జలాల తరలింపుపై తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లాబీయింగ్, రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ అంశంపై నోరు మెదపడం లేదని విమర్శించారు.

మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగదీశ్రెడ్డి మాట్లాడారు. నాగార్జునసాగర్ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోకుండా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకోకుండా నల్లగొండ జిల్లా ఆయకట్టుకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

సాగర్ ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ(AMRP) కింద వెంటనే కృష్ణా జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేయకపోతే ‘చలో సాగర్’ పేరుతో సాగర్ను ముట్టడించి తమ హక్కైన నీటిని సాధించుకుంటామని హెచ్చరించారు.

రైతుల హక్కులు, కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని జగదీశ్రెడ్డి తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో రైతుల ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. వచ్చే నెల 3న మిర్యాలగూడలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సాగర్ ఆయకట్టు రైతాంగం పెద్దఎత్తున తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు డైరెక్షన్లోనే కృష్ణా జలాల దోపిడీ జరుగుతోందని జగదీశ్రెడ్డి ఆరోపించారు. రేవంత్రెడ్డి, చంద్రబాబు కలిసి సాగర్ రైతులపై పగబట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కుడి కాల్వ కింద పంటలు పండుతుంటే, తెలంగాణలో ఎడమ కాల్వ కింద రైతుల పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు.

జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చిన్న పదవుల కోసం ప్రజల ముందు దోషులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారని విమర్శించారు. ఆంధ్ర నాయకులకు తొత్తులుగా మారారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబీమా, రైతుబంధు ఎగ్గొట్టి మోసం చేసిందని జగదీశ్రెడ్డి ఆరోపించారు. మహిళలకు రూ.2,500, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను కూడా అమలు చేయలేదన్నారు. మిర్యాలగూడలో నిర్వహించనున్న రైతు మహాధర్నాతో రాష్ట్ర ప్రభుత్వ బండారం బయటపెడతామని అన్నారు. సాగర్ ఆయకట్టు రైతులు ఇప్పటికైనా చైతన్యమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.

Share
Share