Breaking News: తుంగతుర్తి రాజకీయంలో మంటలు.. ముందు నీ మునుగోడు మురికి కడుక్కో: ఎమ్మెల్యే మందుల సామేలు

సూర్యాపేట/తిరుమలగిరి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై మండిపడ్డారు.

గాంధీభవన్లో ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటంపై ఎమ్మెల్యే మందుల సామేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నాశనమవుతోందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అసలు మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజగోపాల్ రెడ్డికి తుంగతుర్తి నియోజకవర్గంతో ఏం సంబంధమని ప్రశ్నించారు. వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన వారికి తమ నియోజకవర్గం గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు.

  • కోమటిరెడ్డి బ్రదర్స్ పై విమర్శలు: మునుగోడు ఎమ్మెల్యేకు నా నియోజకవర్గంతో ఏం పని?
  • మునుగోడు పై సెటైర్: తుంగతుర్తి గురించి మాట్లాడే ముందు నీ నియోజకవర్గంలోని మురికిని కడుక్కో.
  • కార్యకర్తల అసంతృప్తి: బీజేపీ నుంచి నీతో వచ్చిన వారికే పదవులు ఇవ్వలేదా?
  • హక్కుల పరిరక్షణ: నా శాసనసభ హక్కులకు భంగం కలిగిస్తే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా.

“ముందు నీ మునుగోడు నియోజకవర్గ మురికిని కడుక్కో, ఆ తర్వాత తుంగతుర్తి గురించి మాట్లాడొచ్చు” అంటూ రాజగోపాల్ రెడ్డికి హితవు పలికారు. బీజేపీ నుంచి ఆయనతో పాటు కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులకు మునుగోడులో మండల పార్టీ అధ్యక్షుడు పదవులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఒక స్థానిక శాసనసభ్యుడిగా తన ప్రజాప్రతినిధి హక్కులను హరిస్తే ఊరుకునేది లేదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేలు హెచ్చరించారు.

Share
Share