- 2025 మే లో సంచలనం సృష్టించిన ఘటన
- హైకోర్టు జోక్యంతో కొత్త పరిణామాలు
- పిల్లలను అప్పగించాలని కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
- ప్రతి 15 రోజులకోసారి తల్లిదండ్రులకు కలిసే అవకాశం
- నల్లగొండ శిశుగృహాలోనే 11 మంది చిన్నారులు
- తుది తీర్పు వెలువడే వరకు దత్తత ఇవ్వొదన్న హైకోర్టు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతేడాది మేలో సూర్యాపేట జిల్లా పోలీసులు చేధించిన హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి చిన్న పిల్లను అక్రమంగా తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాలో పిల్లలు లేని తల్లిదండ్రులకు విక్రయించిన సంగతి తెలిసిందే. హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న చిన్నారులను నల్లగొండలోని శిశుగృహకు అప్పగించారు. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి అప్పగించాలని, హైకోర్టులో కేసు వేశారు.
గతేడాది నుంచి కోర్టులో నడుస్తున్న ఈ కేసుకు సంబంధించి పిల్లలను కలిసేందుకు పేరెంట్స్ కు అనుమతిచ్చింది. ప్రతి 15 రోజులకోసారి శిశుగృహకు వెళ్లి గంట సేపు పిల్లలతో గడిపేందుకు అనుమతిచ్చింది. మొత్తం 11 మంది చిన్నారులను పోలీసులు శిశుగృహకు అప్పగించగా, 9 మంది పిల్లల పేరెంట్స్ కు పర్మిషన్ లభించింది. హైకోర్టు తుది తీర్పు ప్రకటించే వరకు పిల్లలను ఎవరికీ దత్తత ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.