అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం.. కుట్రలు చేస్తే సహించం: పందుల సైదులు హెచ్చరిక

నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పుష్కరకాలం పూర్తవుతున్న సందర్భంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో వినూత్న కార్యక్రమం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు, పౌర సమాజ సంస్థలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థి నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ‘అమరుల స్మృతి దీపం’ పేరిట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల ఆత్మబలిదానాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రక్తం కూర్చిన రాష్ట్రం: “తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, భిక్ష వల్లనో వచ్చింది కాదు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలతో పాటు వివిధ వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు చేసిన పోరాటాలు, వేలాది మంది అమరవీరుల ఆత్మబలిదానాల ఫలితంగానే ఈనాడు ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది” అని ఆయన స్పష్టం చేశారు. అమరుల త్యాగస్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

నిజమైన తెలంగాణ అంటే ఇదా?: అమరులు కలలుగన్న తెలంగాణ అంటే కేవలం భౌగోళిక సరిహద్దులు మార్చడం మాత్రమే కాదని.. దోపిడీ, పీడన, ప్రాంతీయ వివక్ష, నిరుద్యోగం లేని సామాజిక సమానత్వ ప్రజాస్వామిక తెలంగాణ అని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటుతున్నా అమరుల ఆశయాలకు అనుగుణమైన పాలన ఇంకా పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితులపై పందుల సైదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు: తెలంగాణ రాష్ట్ర అప్పులు ప్రస్తుతం ఏకంగా ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలను దాటిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇంత అప్పులు చేసినా అభివృద్ధి ఫలాలు సాధారణ ప్రజలకు సమానంగా అందడం లేదని విమర్శించారు.

గ్రామీణ ప్రాంతాల నిర్లక్ష్యం: అభివృద్ధి పేరుతో కేవలం హైదరాబాద్ నగరానికే ప్రాధాన్యత ఇస్తూ.. మారుమూల జిల్లాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి సరికాదన్నారు. ఉద్యమం లక్ష్యం ఒక నగరాన్ని నిర్మించడం కాదు, ప్రతి గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందడమని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలను బలోపేతం చేయాలని, నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

సమైక్యవాద శక్తులపై, తెలంగాణ వ్యతిరేక శక్తులపై ఉద్యమ నేతలు ఈ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, రాజకీయ అస్తిత్వాన్ని బలహీనపరిచేందుకు కొన్ని విషపూరిత శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అస్తిత్వంపై దెబ్బకొట్టాలని చూస్తే తెలంగాణ సమాజం మరో ఉధృత ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. అమరవీరుల ఆశయాల సాధన వరకు ప్రజాస్వామ్య పంథాలో పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ చైతన్యవంతమైన కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు బోనగిరి దేవేందర్, చీర పంకజ్ యాదవ్, దూసరి కిరణ్ కుమార్, చింతమల్ల గురువయ్య, కే.పర్వతాలు, ఇందూరి సాగర్, ఆర్.విజయ్ కుమార్, పి.ఏడుకొండలు, మల్లేశం ఆర్ లక్ష్మయ్య, పెండెం ధనుంజయ నేత, వెంకటేశ్వర్లు, బీవీ చారి, గద్దపాటి సురేందర్, కే.రత్నయ్య, సునీత, గూడూరి జానకిరామ్ రెడ్డి, అయితగోని జనార్దన్ గౌడ్, మాతంగి అమర్, బట్టు నవీన్, కొండేటి మురళి తదితరులు పాల్గొని అమరులకు జోహార్లు అర్పించారు.

Share
Share