Great: మునుగోడులో విద్యాసంబరం.. రూ. 24.5 లక్షల పారితోషకం అందజేసిన కోమటిరెడ్డి దంపతులు..

మునుగోడు, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ, పేద విద్యార్థుల చదువుకు అండగా నిలవడంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన ధర్మపత్ని కోమటిరెడ్డి లక్ష్మి (KSF చైర్పర్సన్) మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భారీ నగదు పురస్కారాలను అందజేశారు.

మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన 151 మంది విద్యార్థులకు మొత్తం రూ. 24,50,000 విలువైన చెక్కులను, జ్ఞాపికలను అందజేశారు.

  • ప్రథమ స్థానం: రూ. 25,000
  • ద్వితీయ స్థానం: రూ. 15,000
  • తృతీయ స్థానం: రూ. 10,000

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కీలక సందేశాన్ని ఇచ్చారు.

“నేను బడిని గుడితో సమానంగా భావిస్తాను. మన కోసం మనం బ్రతకడం కాదు, మన చుట్టూ ఉన్న పది మంది కోసం బ్రతకడమే నిజమైన గొప్పతనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తోంది.”

ఆయన విద్యార్థులకు ఒక హెచ్చరిక కూడా చేశారు.. సెల్ఫోన్లకు దూరం: విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ గేమ్స్ మరియు బెట్టింగ్స్ వంటి వ్యసనాలకు బానిసలు కావొద్దని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు.

కోమటిరెడ్డి లక్ష్మి గారు మాట్లాడుతూ, తన భర్త పదేళ్లుగా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, విద్యార్థులు కూడా భవిష్యత్తులో పదిమందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కరోనా సమయంలో ఆమె రూ. 5 కోట్ల విలువైన నిత్యావసరాలను పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గత ఏడాది 62 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 189 మంది టెన్త్ విద్యార్థులకు నగదు బహుమతులు అందించిన KSF, ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు కూడా సహాయం అందించడంతో విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగింది. ప్రభుత్వ బడుల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచడమే ఈ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, ఇలా విద్యార్థుల భవిష్యత్తు కోసం సొంత నిధులతో ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయం. లక్షల్లో నగదు బహుమతులు అందజేయడం వల్ల పేద విద్యార్థులకు పైచదువులకు ఆర్థిక భరోసా లభిస్తుంది.

Share
Share