Breaking News: ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు..

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీకి చేరి తీవ్ర వేడిని పుట్టిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో తలెత్తిన తాజా పరిణామాలు, విభేదాల నేపథ్యంలో ఏఐసీసీ (AICC) అధిష్టానం తీవ్రంగా స్పందించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో మరికాసేపట్లో అత్యంత కీలకమైన సమావేశం జరగనుంది.

ఈ భేటీ ప్రాధాన్యత దృష్ట్యా కేసీ వేణుగోపాల్ తన ముందస్తు నాసిక్ పర్యటనను సైతం రద్దు చేసుకుని ఢిల్లీలోనే అందుబాటులో ఉండటం గమనార్హం.

కేసీ వేణుగోపాల్ నివాసంలో జరగబోయే ఈ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశానికి:

  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
  • రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్,
  • పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

మరోవైపు, తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడా హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఆమె ఇప్పటికే కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం.

వివాదాలపై చర్చ: ఇటీవల పార్టీలో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ, నేత చిన్నారెడ్డిల వ్యాఖ్యలు, వివాదస్పద వ్యవహారాలపై ఏఐసీసీ ప్రధానంగా దృష్టి సారించనుంది.

స్పీకర్, మంత్రుల హల్చల్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఢిల్లీలోనే విడిది చేశారు. ఉదయాన్నే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను స్పీకర్ ప్రసాద్ కుమార్ కలిశారు.

నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ సమీక్ష: ప్రభుత్వంలో సమన్వయం, నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.

కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగే భేటీ ముగిసిన అనంతరం, నేతలందరూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి చేరుకోనున్నారు. ఖర్గే సమక్షంలో తెలంగాణ పార్టీ, ప్రభుత్వ సమన్వయంపై తుది నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ వరుస భేటీలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

Share
Share