Breaking News: హైదరాబాద్‌లో ఐపీఎల్‌ టికెట్ల బ్లాక్‌ దందా..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్ (మే 22): భాగ్యనగరంలో ఐపీఎల్ ఫీవర్ పీక్స్కు చేరింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ, హోమ్ గ్రౌండ్ హీరోలు ఎస్ఆర్హెచ్ తలపడుతుండటంతో టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే, ఈ క్రేజ్ను అధికారిక టికెటింగ్ భాగస్వామ్య సంస్థలు సామాన్య ఫ్యాన్స్కు చేర్చడంలో విఫలం కాగా, బ్లాక్ మాఫియా మాత్రం హల్చల్ చేస్తోంది.

అధికారిక ఆన్లైన్ టికెటింగ్ యాప్ అయిన ‘డిస్ట్రిక్ట్ యాప్’ (District) లో టికెట్ల విక్రయాలు ప్రారంభించిన కేవలం 3 నిమిషాల్లోనే 39,000 టికెట్లు సోల్డ్ఔట్ (Sold Out) అయినట్లు బోర్డు పెట్టారు. నిమిషాల వ్యవధిలోనే అన్ని వేల టికెట్లు ఎలా మాయమయ్యాయంటూ క్రికెట్ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ యాప్ యాజమాన్యంతో ముందే చేతులు కలిపిన బ్లాక్ మాఫియా.. పెద్ద సంఖ్యలో టికెట్లను బల్క్గా కొనేసి ఉంటుందని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.

బ్లాక్ మార్కెట్ లూటీ: కనీస ధర రూ. 1,000 ఉన్న సాధారణ గ్యాలరీ టికెట్లను బ్లాక్ మార్కెట్లో రూ. 8,000 నుండి రూ. 10,000 వరకు అమ్ముతున్నారు. ఇక విఐపీ పాస్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

సైబర్ కేటుగాళ్ల ఎంట్రీ: ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు ఒక అడుగు ముందుకు వేశారు. అసలైన యాప్ను పోలినట్లే ఉండే నకిలీ వెబ్సైట్లు, ఫేక్ యాప్లను సృష్టించి, తక్కువ ధరలకే టికెట్లు ఇస్తామంటూ సామాన్య ప్రజలను నమ్మించి, క్యూఆర్ కోడ్ల ద్వారా లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు. తీరా డబ్బులు కట్టాక నకిలీ టికెట్లను చేతిలో పెడుతున్నారు.

కాంప్లిమెంటరీ పాస్దందా: ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో, సోషల్ మీడియా వేదికగా విఐపీలకు, అధికారులకు ఇచ్చే ‘కాంప్లిమెంటరీ టికెట్లను’ సైతం కొందరు బహిరంగంగానే భారీ ధరలకు వేలం పెట్టి అమ్ముతుండటం గమనార్హం.

ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో రికార్డు స్థాయి ధరలకు టికెట్లు బ్లాక్ అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో రాచకొండ పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది నిఘా పెట్టారు. స్టేడియం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతూ, సోషల్ మీడియా గ్రూపుల ద్వారా బ్లాక్ టికెట్ల విక్రయాలు జరుపుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో మ్యాచ్ టికెట్లు, కాంప్లిమెంటరీ పాస్లతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

క్రికెట్ మ్యాచ్ను లైవ్లో చూడాలనే మీ ఉత్సాహాన్ని సైబర్ దొంగలు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేసి, తెలియని వ్యక్తులకు డబ్బులు పంపి మోసపోవద్దని ‘ఏపీబీ న్యూస్’ విజ్ఞప్తి చేస్తోంది. కేవలం అధికారిక కౌంటర్లు లేదా అధీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారానే ధృవీకరించుకోవాలని, బ్లాక్ టికెట్లను కొనుగోలు చేసి నేరగాళ్లను ప్రోత్సహించవద్దని కోరుతోంది.

Share
Share