- వేరు పడుతున్న ఉమ్మడి కుటుంబాలు
- ఒక్కో కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురు సభ్యులే
- కుటుంబ స్వేచ్చను కోరుకుంటున్న కొత్త తరం యువత
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు కాలం చెల్లుతోంది. చిన్న కుటుంబాలుగా ఉండేందుకే నేటి తరం ఇష్టపడుతోంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క, చెళ్లెలతో కలిసి ఉండే నాటి ఉమ్మడి వ్యవస్థ కనుమరుగువుతోంది. పెళ్లిళ్లు కావడమే ఆలస్యం కుటుంబాలు వేరు పడుతున్నాయి. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో చదువులు, ఉద్యోగాలు, పెళ్లిలు అన్ని అక్కడే ముగించేస్తున్నారు. తల్లిదండ్రులతో, సొంత ఊళ్లలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఆసక్తిచూపడం లేదు.
సామాజిక ఆర్ధిక సర్వేలో సగటు కుటుంబ పరిమాణం పరిశీలిస్తే ఒక్కో కుటుంబంలో ముగ్గురు, నలుగురికి మించి కలిసి ఉండట్లేదు, అది కూడా దిగువ, మధ్య తరగతి కుటుంబాలే తప్పా, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు వేరుగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సగటు కుటుంబ పరిమాణం నల్లగొండ, యాదాద్రి జిల్లాలో 3.1 శాతం ఉండగా, సూర్యాపేట జిల్లాలో అయితే ఒక్కో కుటుంబంలో 2.8 శాతం అంటే కనీసం ముగ్గురు కలిసి జీవించడం కూడా భారమవుతుంది. చాలీ చాలనీ ఆదాయం, భరించలేని ఖర్చులు, ఆర్ధిక అవసరాలు పెరిగిపోవడంతో ఎవరి కుటుంబ బాగోగులను వాళ్లే చూసుకోవాలనే తపన పెరిగిపోతుంది. దాంతో చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోతోంది.