Breaking News: ఘోరం: ‘ఆడపిల్ల’ పుడుతుందనే అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్ల దారుణ హత్య

హన్మకొండ, ఏపీబీ న్యూస్: కన్న బిడ్డలను కాపాడుకోవాల్సిన తండ్రి, కట్టుకున్న భార్యకు అండగా ఉండాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందనే ఉన్మాదంతో నిండు గర్భిణి అయిన భార్యను, పసిప్రాయంలో ఉన్న ఇద్దరు కూతుళ్లను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేసి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో వెలుగుచూసింది.

పున్నేలు గ్రామ శివారులో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్న అజారుద్దీన్, తన భార్య ఫర్హాత్ (26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా (6) తో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. గతంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఫర్హాత్ రెండుసార్లు గర్భం దాల్చగా, ఆడపిల్లలే పుడతారనే అనుమానంతో అజారుద్దీన్ బలవంతంగా అబార్షన్ చేయించాడు.

నాలుగేళ్ల విరామం తర్వాత ఫర్హాత్ మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే భయంతో అబార్షన్ చేయించుకోవాలని అజారుద్దీన్ ఆమెను తీవ్రంగా వేధించాడు. అయితే, ఫర్హాత్ అందుకు నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. బుధవారం రాత్రి భార్య పిల్లలను తమ స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి, వారిని అందులోకి నెట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.

హత్య చేసిన తర్వాత అది ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించేందుకు అజారుద్దీన్ నాటకమాడాడు. అయితే, తన అల్లుడి ప్రవర్తనపై అనుమానం ఉందని ఫర్హాత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు అజారుద్దీన్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తానే ముగ్గురిని హత్య చేసినట్లు అంగీకరించాడు.

21వ శతాబ్దంలో ఉన్నా మగ పిల్లవాడి కోసం ఆడపిల్లలను చిదిమేసే ఉన్మాదం ఇంకా కొనసాగడం సిగ్గుచేటు. కేవలం అనుమానంతో పసిపిల్లలను, గర్భిణి అని కూడా చూడకుండా భార్యను హతమార్చిన అజారుద్దీన్ వంటి వ్యక్తులకు కఠినమైన శిక్ష పడాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సామాజిక చైతన్యం పెరగాలి.

Share
Share