జనగామ, ఏపీబీ న్యూస్: జనగామ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 10వ వార్డులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అభ్యర్థిగా బరిలో ఉన్న జున్ను సుజాత తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తీన్మార్ మల్లన్న సిద్ధాంతాలతో, సామాన్యుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆమె గడప గడపకూ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనగామ పట్టణంలోని 10వ వార్డులో ప్రచారం తారాస్థాయికి చేరింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి జున్ను సుజాత తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పార్టీకి కేటాయించిన ‘కత్తెర’ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తూ, వార్డు సమస్యలపై గళం విప్పుతున్నారు.
ఇంటింటి ప్రచారం.. ప్రజా సమస్యలే అజెండాగా!
వార్డు పరిధిలోని పలు వీధుల్లో సుజాత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “వార్డులో పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఎద్దడి, వీధి దీపాల వంటి మౌలిక వసతుల లేమిని పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత. అవినీతిని కత్తిరించడానికి, అభివృద్ధిని పెంచడానికి ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలి” అని అభ్యర్థించారు. తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా, సామాన్యుల గొంతుకగా కౌన్సిల్లో అడుగుపెడతానని ఆమె హామీ ఇచ్చారు.
పార్టీ శ్రేణుల భారీ మద్దతు
ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓదేలు యాదవ్ పాల్గొని సుజాతకు మద్దతుగా నిలిచారు. ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ రాజ్యాధికార పార్టీ సామాన్యుల కోసం పుట్టిన పార్టీ. ప్రజా సమస్యల మీద పోరాడే వీరనారి సుజాతక్కను గెలిపించుకోవాల్సిన బాధ్యత వార్డు ప్రజలపై ఉంది” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:
- జిల్లా అధ్యక్షురాలు: చెరుకూరి మౌనిక యాదవ్
- జిల్లా ఉపాధ్యక్షులు: బొప్పరి సంతోష్
- జిల్లా కార్యదర్శి: వీరస్వామి
- తరిగొప్పుల మండల అధ్యక్షులు: శ్రీకాంత్ గౌడ్
ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, వార్డు యువత మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సుజాతకు నీరాజనాలు పట్టారు. “మన వార్డు-మన బిడ్డ” అంటూ నినాదాలతో 10వ వార్డు మార్మోగింది.