- కుటుంబ సమేతంగా మట్టపల్లి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్
- హుజూర్నగర్లో అగ్రికల్చర్ కాలేజీ, నవోదయ స్కూళ్లకు శంకుస్థాపన
- మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కుల పంపిణీ
హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: “వ్యవసాయం ఒక విజ్ఞానమని” ఇప్పటివరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ గా మారిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, మట్టపల్లి లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు. దేవాలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆ తర్వాత వేదిక వద్ద హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద 100 ఎకరాలలో 150 కోట్లతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేశారు. అంతేగాక కోదాడ సమీపంలో 50 కోట్లతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన చేయడమే కాక, మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న యాత్రికా సదన్, నూతన కిచెన్ షెడ్ కు, మరో కోటి రూపాయల వ్యయంతో నిర్మించే డార్మెటరీ బిల్డింగులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం సంతోషమని అన్నారు. అలాగే రైతులకు ఉపయోగపడే వ్యవసాయ కళాశాలకు, విద్యార్థులకు ఉపయోగపడే నవోదయ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. “వ్యవసాయం ఒక విజ్ఞానమని”, ఇంతకు పూర్వం దేశంలో జై జవాన్, జై కిసాన్, నినాదం ఉండేదని, ఆ తర్వాత జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం వచ్చిందని, ప్రస్తుతం ఇది జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ గా మారిందని తెలిపారు. గంగ, యమునా, సరస్వతి లాగే కృష్ణ, గోదావరి, కావేరి నదులు ఉండడం, మట్టపల్లిలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేయడం, ప్రత్యేకించి పామాయిల్ పెంపకం చేపట్టడం అభినందనీయం అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ రైతులకు 2 కోట్ల 47 లక్షల విలువ చేసే వ్యవసాయ యంత్ర పరికరాల ప్రోసీడింగ్స్ ను అందజేశారు. అంతేకాక స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద 504 కోట్లు, ఆదాయ వనరులను పెంపొందించేందుకు మరో 89 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు.

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
దేశంలో ఎక్కడా లేనివిధంగా 85శాతం మందికి ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. మట్టపల్లి అభివృద్ధికి తన వంతు శాయ శక్తుల ఇదివరకే కృషి చేశానని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. హుజూర్నగర్ నుండి మట్టపల్లి వరకు 80 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేశామని, గతంలో 50 కోట్లతో బ్రిడ్జి నిర్మించామని చెప్పారు. కృష్ణ, గోదావరి జలాలో ఒక చుక్క నీటిని కూడా వదులుకోమని, కృష్ణ, గోదావరి జలాల హక్కులు కాపాడుకునేందుకు ఏ పోరాటైనకైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హుజూర్నగర్, కోదాడ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే తన లక్ష్యమన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
రానున్న రోజుల్లో ఐటీ, ఏఐ కన్నా వ్యవసాయ రంగమే ముందుంటుందని, సాఫ్ట్ వెర్, ఐటి సెక్టార్ ల నుండి వచ్చి వ్యవసాయ రంగంలో పనిచేసే రోజులు వస్తాయని అన్నారు. వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి జిల్లాలలో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వ్యవసాయ కళాశాలలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రెండు కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి తెలంగాణ రైతులు దేశంలోనే ముందున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పామాయిల్ పంటలో దేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని, ప్రస్తుతం 10 లక్షల ఎకరాలలో పామాయిల్ తోటలు పండిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ జానయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎమ్మెల్సీ శంకర్, ఎంపీ కుందూర్ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, పద్మావతి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, జిల్లా ఎస్పీ కే. నరసింహ తదితరులు పాల్గొన్నారు.