మాయమవుతున్న మానవత్వం: ‘ముసలోళ్లు ఉన్నారని’ ఇల్లు అద్దెకు ఇవ్వని యజమానులు..

జగిత్యాల, ఏపీబీ న్యూస్: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవడం ప్రతి బిడ్డ బాధ్యత. కానీ, ఆ బాధ్యతను నెరవేర్చాలన్నా కూడా నేటి సమాజంలో అద్దె ఇళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. “నీవు ఒక్కదానివే ఉంటే ఇల్లు ఇస్తాం.. ముసలివాళ్లు ఉంటే వద్దు” అంటూ ఇంటి యజమానులు నిరాకరిస్తుండటంతో, ఓ మహిళ తన తల్లిదండ్రులను కాపాడుకోవడానికి ప్రభుత్వం వైపు మొరపెట్టుకుంది.

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ఆమె, నివసించడానికి ఒక అద్దె ఇల్లు కోసం గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, ఆమె వెళ్ళిన ప్రతిచోటా చేదు అనుభవమే ఎదురవుతోంది.

మంజుల తన తల్లిదండ్రులు ఉన్నారని చెప్పగానే, ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. “నీవు ఒక్కదానివే ఉంటే ఇల్లు ఇస్తాం, వృద్ధులు ఉంటే ఇబ్బంది అవుతుంది” అంటూ మొహం మీదే చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అద్దె ఇల్లు దొరకక, కన్నవారిని రోడ్డు మీద వదలలేక ఆమె పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మంజుల అధికారులకు వినతి పత్రం అందజేసింది.

“సమాజంలో మానవత్వం మాయమవుతోంది. కన్న తల్లిదండ్రులను చూసుకుందామంటే ఎవరూ నీడ ఇవ్వడం లేదు. ప్రభుత్వం దయతలిచి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే, నా తల్లిదండ్రులను గౌరవంగా, ప్రశాంతంగా చూసుకుంటాను” అని ఆమె అధికారులను వేడుకుంది.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు పెట్టింది పేరైన మన సమాజంలో, నేడు వృద్ధులను భారంగా చూడటం బాధాకరం. అద్దె ఇళ్ల యజమానులు కేవలం లాభాపేక్షతో లేదా వృద్ధుల వల్ల ఇబ్బందులు కలుగుతాయనే సాకుతో ఇల్లు ఇవ్వకపోవడం అమానవీయం. మంజుల వంటి మహిళలు కన్నవారి కోసం పడుతున్న ఈ తపన అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Share
Share