- పధకాల అమలులో రాష్ట్రంలో జిల్లాను ప్రధమ స్థానంలో నిలుపుతాం
- సామాజిక, ఆర్దిక, విద్యా, ఉపాధి మెరుగు పరిచేందుకు ప్రణాళికలు
- ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
సూర్యాపేట, ఏపీబీ న్యూస్: జిల్లా ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. సోమవారం నాడు సూర్యాపేట పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాజ్యాంగ ఆశయాల సాధనే ధ్యేయం
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, అంకితభావం వంటి విలువలను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధికి, మహిళలకు సమన్యాయం కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే కాలంలో సాంకేతిక రంగంలో సూర్యాపేట యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాల పురోగతి – జిల్లా గణాంకాలు:
- రైతు భరోసా: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ. 10 వేల నుండి రూ. 12 వేలకు పెంచిందని, జిల్లాలోని 11.90 లక్షల ఎకరాల సాగు భూమికి ఈ సాయం అందుతుందని వివరించారు.
- మహాలక్ష్మి పథకం: జిల్లాలో ఇప్పటివరకు 4.32 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని, దీని ద్వారా మహిళలకు రూ. 250.75 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు.
- గృహలక్ష్మి & ప్రజా పాలన: ఇల్లు లేని నిరుపేదలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించే ప్రక్రియలో భాగంగా లక్షా 97 వేల అర్హత గల దరఖాస్తులను గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.
- గ్యాస్ సబ్సిడీ: రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 6.43 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 18.94 కోట్ల సబ్సిడీ అందించారు.
- సన్న బియ్యం బోనస్: వానాకాలం సీజన్లో సేకరించిన 2.36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 చొప్పున మొత్తం రూ. 118.41 కోట్ల బోనస్ను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
- రేషన్ కార్డులు: జిల్లాలో కొత్తగా 44,165 రేషన్ కార్డులను మంజూరు చేసి, మరో 70 వేల మంది కొత్త సభ్యులను చేర్చినట్లు వెల్లడించారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
జిల్లాను విద్యా హబ్గా మార్చేందుకు ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని కలెక్టర్ తెలిపారు.
- నవోదయ పాఠశాల (కోదాడ): 19.12 ఎకరాల్లో రూ. 53.15 కోట్లతో నవోదయ పాఠశాలకు ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.
- వ్యవసాయ కళాశాల (హుజూర్ నగర్): మగ్దూం నగర్లో 100 ఎకరాల విస్తీర్ణంలో రూ. 126 కోట్లతో నూతన వ్యవసాయ కళాశాల ఏర్పాటు కానుంది.
- యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్: ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం 25 ఎకరాల భూమిని కేటాయించారు.
- డిజిటల్ లెర్నింగ్: 6 నుండి 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ లెర్నింగ్ పాఠ్యపుస్తకాలను రూపొందించడం ఒక వినూత్న అడుగు అని కొనియాడారు.
జిల్లాను అన్ని రంగాలలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.