ముస్లిం మైనార్టీల కోసం రూ.10 కోట్లతో అత్యాధునిక షాదీఖానా: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లతో పాటు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాన్యం చెల్కలో నూతన స్కూల్ భవనానికి భూమిపూజ చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ పాఠశాల నిర్మాణ పనులు రేపటి నుంచే ప్రారంభమవుతాయని, అవసరమైతే అదనంగా రూ.కోటి వరకు నిధులు కేటాయించి అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉర్దూను రెండవ భాషగా గుర్తించామని, సచార్ కమిటీ సిఫారసుల మేరకు ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించామని మంత్రి గుర్తుచేశారు.

చిన్న వయసు నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: నల్లగొండలోని ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ విద్యతో పాటు అడ్వాన్స్డ్ ఏఐ (AI) శిక్షణ కూడా ఇస్తున్నామని, మైనార్టీ విద్యార్థులు దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. బొట్టుగూడ పాఠశాల తరహాలోనే ఈ నూతన ఉర్దూ మీడియం స్కూల్లోనూ చిన్న తరగతుల నుంచే ఏఐ టెక్నాలజీని ప్రవేశపెడతామన్నారు.

షాదీఖానా, ఇందిరమ్మ ఇళ్లు: ముస్లింల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో భారీ షాదీఖానా నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అర్హులైన పేద మైనార్టీలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు అందిస్తామన్నారు.

శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు జిల్లా కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ (2BHK) ఇళ్లను ఆకస్మికంగా పరిశీలించారు. ఇళ్ల పరిసరాలను చూసి, పెండింగ్లో ఉన్న చిన్న చిన్న మరమ్మతు పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జూలై నాటికి లబ్ధిదారుల గృహప్రవేశాలకు ఇళ్లను సర్వసిద్ధం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో విద్యా, వైద్య సౌకర్యాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “విద్య, వైద్యం” నినాదంతో ముందుకెళ్తున్న మంత్రి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్య అందేలా చూస్తామని, ఉర్దూ మీడియం స్కూల్ భవనాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆఫీస్ ఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సుశీందర్రావు, మౌలానా సిద్ధికి, బషీర్, అక్బర్ ఖాన్ మరియు ఆర్అండ్బీ, విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Share
Share