BRS హయాంలో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు ‘కూలేశ్వరం’ అయింది: ఎంపీ చామల

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: BRS మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలకు కౌంటర్ గా కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నడూ అభివృద్ధికి అడ్డుపడలేదని, కానీ అధికారం కోల్పోయిన BRS మాత్రం ప్రతి అడుగులో అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. కోకాపేట శారదాపీఠం భూమి వివాదం మొదలు మూసీ ప్రక్షాళన, హైడ్రా, మెట్రో వాటర్ వరకు అన్నింటిపై ఆయన స్పష్టత ఇచ్చారు.

BRS హయాంలో 2019లో కోకాపేట నియో పోలీస్ పరిధిలో శారదాపీఠానికి రెండు ఎకరాలు ఎకరానికి కేవలం ఒక రూపాయి చొప్పున ఇచ్చారని చామల వివరించారు. BRS ప్రభుత్వం తమకు నచ్చిన వారికి భూములను యథేచ్ఛగా పంచి పెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు కోకాపేటలో మెట్రో వాటర్ వర్క్స్ కోసం భూమి అవసరమైన నేపథ్యంలో, శారదాపీఠానికి శంషాబాద్లో రెండు ఎకరాల డెవలప్మెంట్ ల్యాండ్ కేటాయించడం జరిగిందని, ఇందుకు అధికారులు శారదాపీఠం వారిని ఒప్పించి తర్వాత క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారని చామల స్పష్టం చేశారు.

మూసీ ప్రక్షాళన, మెట్రో ఫేజ్-2, ట్రిపుల్ ఆర్ పనులు కాంగ్రెస్ హయాంలో జరగకూడదని BRS కుట్రలు చేస్తోందని చామల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే మళ్ళీ అధికారం వస్తుందనే భయంతో KTR, హరీష్ రావు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. సబర్మతి నది పునరుద్ధరణలో వేలాది ఇళ్లు తొలగించిన BJP పాలిత రాష్ట్రాన్ని ప్రశంసిస్తూ, మూసీ విషయంలో మాత్రం అభ్యంతరం చెప్పడం, BJP కి ఒక న్యాయం, కాంగ్రెస్కి మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.

హైడ్రాపై BRS చేస్తున్న విష ప్రచారాన్ని చామల ఖండించారు. చెరువులు, నాళాలు, పార్కుల కబ్జాలను కాపాడటానికి హైడ్రా అవసరమని, మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని హామీ ఇచ్చారు. హరీష్ రావు స్వయంగా మధుపార్క్ రిడ్జ్ వద్దకు వెళ్ళి అపార్ట్మెంట్ వాసులను రెచ్చగొట్టారని, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టే చర్య అని విమర్శించారు.

BRS హయాంలో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు ‘కూలేశ్వరం’ అయిందని చామల వ్యాఖ్యానించారు. అవసరం లేకపోయినా సెక్రటేరియట్, ప్రగతి భవన్ నిర్మించిన BRS మేడారం అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి చేశారని, సమ్మక్క సారక్క జాతరకు 150 కోట్లు కేటాయించారని, రానున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే నిధులు సిద్ధం చేస్తున్నారని చామల తెలిపారు.

తెలంగాణ BJP అధ్యక్షుడు రామచంద్రరావు BRS చెప్పింది చెప్పే ‘తోక’ గా మారారని చామల విమర్శించారు. ఢిల్లీలో ఒక మాట, స్థానికంగా మరో మాట మాట్లాడడం BJP ద్వంద్వ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ BJP అధ్యక్షుడు తెలంగాణ ప్రజల కోసం పని చేయాలని, BRS ను అనుసరించడం ఆపాలని ఆయన సూచించారు.

Share
Share