- కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి హైడ్రామా నడిపించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
- ఫ్యామిలీ టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులకు దిమ్మతిరిగే షాక్
- పార్టీ విధేయులకే టికెట్లు కనఫర్మ్, భార్గవ్కు నాలుగు
- మరి కొద్ది సేపట్లో అభ్యర్థుల జాబితా వెల్లడి
- ఢిల్లీ నుంచి ఎంపీ రఘువీర్ రాక.. ఎల్లుండి సీఎం రేవంత్ మీటింగ్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సొంత పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పెద్ద హైడ్రామానే నడిపించారు. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపడం వెనక అసలు సంగతిని పసిగట్టిన పార్టీ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. 48 వార్డుల్లో 20 వార్డులకు పైగా సొంత పార్టీకి చెందిన కుటుంబ సభ్యులే ఆశిస్తున్నారు. ప్రధానంగా మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్, అతని భార్య, గుడిపాటి నవీన్, అతని భార్య, మిట్టపల్లి వెంకటేశ్ వాళ్ల అమ్మ, చిలుకూరు బాలకృష్ణ భార్య, పొదిలి వెంకన్న తల్లి, చిన్నమ్మ ఇలా మొత్తం 10 మంది కుటుంబ సభ్యులే టికెట్లు కోసం పోటీ పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా మరోవైపు భార్గవ్ తన అనుచరుల కోసం ఇంకో పది టికెట్లు కావాలని పట్టుబడుతున్నారు. 20 వార్డులకు పైగా కుటుంబ సభ్యులు, అనుచరులకే కేటాయిస్తే, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తలకు, లీడర్ల వద్ద ఎలా తలెత్తుకోవాలో ఎమ్మెల్యేకు పాలుపోలేదు.
రంగంలోకి ఎమ్మెల్యే ఫ్యామిలీ
ఫ్యామిలీ టికెట్లు ఆశిస్తున్న వాళ్లందరికి చెక్ పెట్టాలంటే తన కుటుంబాన్ని రంగంలోకి దింపడమే ఏకైక మార్గం అని భావించిన ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులతో నామినేషన్ వేయించారు. దీంతో మిర్యాలగూడ మున్సిపాలిటీ మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీతో నిండిపోతుందనే ప్రచారం ఊపందుకుంది. దీన్నే అదునుగా భావించిన బీఆర్ఎస్ శిభిరం ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రయోగించింది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో నామినేషన్ వేయించారనే సంగతి మీడియా ద్వారా బయటకు లీక్ అవడంతో పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అప్పటికే ఎంపీ రఘువీర్ రెడ్డి, ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పలు దఫాలుగా చర్చలు జరిపిన్పప్పటికీ ఆశావహులు వెనక్కి తగ్గలేదు. ఎప్పుడైతే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నామినేషన్ వేశారో మరుక్షణం అధిష్టానం మరోసారి ఎంపీ రఘువీర్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ఫ్యామిలీ టికెట్లకు చెక్ పెట్టిన ఎమ్మెల్యే
కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే వేసిన ఎత్తులతో చివరకు ఆశావహులు సర్ధుకున్నారు. ఎవరికైనా ఒకటే టికెట్ ఇస్తామని, అంతకు మించి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తేలేదని అందరి నోళ్లు మూయించారు. భార్గవ్కు సైతం మూడు, నాలుగుకు మించి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత రెండు రోజుల నుంచి భార్గవ్తో జరిపిన చర్చలు సోమవారం కొలిక్కివచ్చాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సైతం సోమవారం నామినేషన్ ఉప సంహరించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒప్పందం ప్రకారం వేణుగోపాల్ రెడ్డి భార్య నూకల కవిత చైర్మన్ అభ్యర్థిగా డిసైడ్ చేశారు. దీనిలో భాగంగానే ఆమె తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. మరికొద్ది సేపట్లో ఎంపీ రఘువీర్ మిర్యాలగూడకు చేరుకోగానే కాంగ్రెస్ జాబితా ప్రకటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అభ్యర్థులతో మీటింగ్ పెట్టారు. ఎంపీ, ఎమ్మెల్సీ, భార్గవ్ అందరి సహకారంతో మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
బుధవారం సీఎం రేవంత్ సభ:
బుధవారం మధ్యాహ్నాం 2 గంటలకు మిర్యాలగూడలో సీఎం సభ జరగనుంది. ఈ మేరకు ఎమ్మెల్యే సీఎం సభ ఏర్పాట్ల పైన ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు సీఎం నల్లగొండ, దేవరకొండ, ఆలేరు, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ విడత లో మిర్యాలగూడలోనే సభ పెట్టాలని ఎమ్మెల్యే కోరడంతో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.