- బీఆర్ఎస్ నుంచి నామినేషన్ దాఖలు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యూహాం
- కాంగ్రెస్ నుంచి మొరిశెట్టి లక్ష్మాబి భార్య నివేధిత
- రెండు పార్టీల నుంచి ఆర్యవైశ్యులకే ఛాన్స్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ రేసులో కల్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల నామినేషన్ వేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆమెను కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటించారు. భారత సైన్యంలో పనిచేసి 2020లో చైనా-ఇండియా వాగ్వివాదాల సమయంలో అతను అమరుడయ్యారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సంతోష్ బాబు తల్లి మంజులను కౌన్సిలర్ పోటీకి నిలబెట్టారు.

కాంగ్రెస్ తరపున ప్రముఖ వ్యాపారవేత్త మొరిశెట్టి లక్ష్మాబి భార్య నివేధిత నామినేషన్ వేశారు. మంజుల, నివేధిత ఇద్దరు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ ఎన్నికల్లో పేట మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని వైశ్యులకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొదట్లో కొప్పుల వేణా రెడ్డి ఆశించినప్పటికీ పార్టీ నేతలు సర్ధిచెప్పడంతో వెనక్కి తగ్గారు. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి సైతం డాక్టర్ రామ్మూర్తి యాదవ్ పేరును ప్రతిపాధించారు. ఈ రెండువర్గాల మధ్య సమన్వయం చేయడం కోసం మధ్యేమార్గంగా లక్ష్మాబి భార్యను పోటీలోకి దింపినట్టు తెలిసింది. 48 వార్డుల్లో 12 నుంచి 15 వార్డులు రమేష్ రెడ్డి వర్గానికి ఇచ్చేలా ఒప్పందం జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి వైశ్యులకు అవకాశం ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో అప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి చైర్మన్ పదవి ఆశించిన మాజీ చైర్మన్ బండా ప్రకాష్ నీరుగారిపోయారు.
