- కాంగ్రెస్ నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి భార్య చైతన్య,
- బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి భార్య లిఖితా, బీజేపీ నుంచి పిల్లి రామరాజు యాదవ్ భార్య సత్యవతి
- 19 మున్సిపాలిటీల్లో ఎస్సీలకు 2, బీసీలకు 3, జనరల్ 7, జనరల్ మహిళలకు 7
- పది మున్సిపాలిటీల్లో మహిళా చైర్మన్లే
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నీలగిరి కార్పోరేషన్ మేయర్ పీఠం రేసులో మున్సిపల్ మాజీ చైర్మన్ సతీమణులు బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్య, బీఆర్ఎస్ నుంచి మందడి సైదిరెడ్డి భార్య లిఖితా, బీజేపీ నుంచి బీసీ నేత పిల్లి రామరాజు యాదవ్ భార్య సత్యవతి పోటీ చేయనున్నారు. వీళ్లలో చైతన్య, సత్యవతి మాజీ కౌన్సిలర్లు, సత్యవతి భర్త పిల్లి రామరాజు యాదవ్ సైతం మాజీ కౌన్సిలర్, సైదిరెడ్డి భార్య లిఖిత తొలిసారిగా రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు. బీసీ మహిళలకు డిప్యూటీ మేయర్ ఇవ్వాల్సి వస్తే మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ భార్య కవిత రేసులో ఉన్నారు. కానీ రెండు పదవులు మహిళలకే ఇస్తారా అన్నది ప్రశ్నార్ధకం. మున్సిపల్ చరిత్రలో ఒక్కసారి మాత్రమే ముస్లిం, మైనార్టీ మహిళలకు వైస్ చైర్మన్ పదవి దక్కింది. ఈసారి ముస్లిం లేదా ఎస్సీ లకు డిప్యూటీ మేయర్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.



భర్తల సిట్టింగ్ సీట్లు గాయబ్
మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ స్థానం 32, ఆయన భార్య చైతన్య 33 వార్డుల్లో కౌన్సిలర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు వార్డులు మహిళలకే రిజర్వు అయ్యాయి. దీంతో శ్రీనివాస్ రెడ్డి మరొక వార్డు నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. గతంలో ఎస్టీగా ఉన్న 10 వార్డు జనరల్ అయ్యింది. ఈ వార్డుల్లో దాదాపు 14 వందలకు పైగా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. కావున శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెపుతున్నారు. గతంలో పోటీ చేసిన గుమ్మల మోహన్ రెడ్డి భార్య వార్డు 13 జనరల్కు రిజర్వు చేశారు. ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న 33 వార్డు కూడా జనరల్ మహిళ అయ్యింది. శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డిలు రాజకీయ అవగాహన వచ్చారని, మేయర్ పదవి శ్రీనివాస్ రెడ్డికే వదిలేసినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. బీఆర్ఎస్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి వార్డు మహిళలకు మారడంతో ఆయన భార్యను నిలబెడుతున్నారు. పిల్లి రామరాజు భార్య సత్యవతి 2014లో 27 వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 8 వార్డు బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. కావున సత్యవతిని ఇక్కడి నుంచి పోటీ చేయించి, మేయర్ రేసులో నిలబెట్టాలని బీజేపీ ఆలోచన చేస్తోంది.
9 మంది మహిళా చైర్మన్లు, ఒక మహిళా మేయర్
ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో నల్లగొండ మేయర్ మహిళ కాగా, మరో 9 మున్సిపాలిటీల్లో మహిళలే చైర్మన్లు. ఎస్సీలకు రెండు, బీసీలకు 3, జనరల్ 7, జనరల్ మహిళలకు 7 చైర్మన్ స్థానాలు రిజర్వు చేశారు. బీసీలకు రిజర్వు చేసిన మూడింటిలో ఒక్కటి మాత్రమే జనరల్ కాగా, రెండు మున్సిపాలిటీలు మహిళలకే రిజర్వు చేశారు.
మున్సిపాలిటీ వారీగా రిజర్వేషన్ వివరాలు
| మున్సిపాలిటీ | రిజర్వేషన్ |
| నందికొండ | ఎస్సీ జనరల్ |
| మోత్కూరు | ఎస్సీ మహిళ |
| దేవరకొండ | బీసీ మహిళ |
| హుజూర్నగర్ | బీసీ జనరల్ |
| ఆలేరు | బీసీ మహిళ |
| చండూరు | జనరల్ |
| నకిరేకల్ | జనరల్ |
| హాలియా | జనరల్ |
| మిర్యాలగూడ | జనరల్ మహిళ |
| చిట్యాల | జనరల్ మహిళ |
| చౌటుప్పుల్ | జనరల్ మహిళ |
| భువనగిరి | జనరల్ మహిళ |
| యాదగిరిగుట్ట | జనరల్ మహిళ |
| పోచంపల్లి | జనరల్ |
| నేరేడుచర్ల | జనరల్ |
| కోదాడ | జనరల్ మహిళ |
| తిరుమలగిరి | జనరల్ |
| సూర్యాపేట | జనరల్ |
| నల్లగొండ | జనరల్ మహిళ (కార్పోరేషన్) |