Breaking News: తిరుమల లడ్డూపై డిబేట్లు ఆపేయండి.. ఏబీఎన్, టీవీ5 సహా పలు ఛానెళ్లకు విజయవాడ కోర్టు నోటీసులు!

విజయవాడ, ఏపీబీ న్యూస్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న వివాదాస్పద చర్చలకు బ్రేక్ వేస్తూ విజయవాడ సీనియర్ సివిల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అంశంపై గత కొంతకాలంగా సాగుతున్న మీడియా డిబేట్లను నిలిపివేయాలంటూ ప్రముఖ తెలుగు వార్తా సంస్థలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothi), టీవీ5 (TV5), మహా న్యూస్ (Mahaa News), ఈటీవీ (ETV) లకున్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి విజయవాడ సివిల్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ప్రత్యేక విచారణ బృందం (SIT) ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిందని, లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు (Animal Fat) లేదని నిర్ధారించిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అయినప్పటికీ, కొన్ని మీడియా సంస్థలు కావాలనే ఈ అంశాన్ని పదే పదే చర్చిస్తూ, భక్తుల మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన విజయవాడ సీనియర్ సివిల్ కోర్టు.. సదరు మీడియా సంస్థల తీరుపై నోటీసులు జారీ చేసింది. అపవిత్రత పేరుతో కోట్లాది మంది భక్తుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై అనుచిత చర్చలు, కథనాలు ప్రసారం చేయకూడదని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ అంశంపై డిబేట్లను నిలిపివేయాలని స్పష్టం చేసింది.

గత ఏడాది సెప్టెంబర్లో తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ (NDDB) రిపోర్టులో తేలిందంటూ రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో సిట్ (SIT) దర్యాప్తు చేపట్టింది. ఇటీవల సిట్ సమర్పించిన చార్జిషీట్లో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని, అయితే అది కేవలం పామాయిల్ మరియు ఇతర వెజిటబుల్ ఆయిల్స్ కల్తీ అని, జంతు కొవ్వు ఆధారాలు లభించలేదని నివేదించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కోర్టు నోటీసుల నేపథ్యంలో, ఈ వివాదానికి మీడియా వేదికగా సాగుతున్న చర్చలకు తాత్కాలికంగా తెరపడనుంది.

సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం దాఖలు చేసిన ఛార్జ్షీట్లో వెల్లడైన సంచలన విషయాలు ఇవే:

జంతు కొవ్వు ఆనవాళ్లు లేవు: లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో ‘జంతు కొవ్వు’ (Animal Fat) అంటే ఎముకల కొవ్వు (Tallow), పంది కొవ్వు (Lard) లేదా చేప నూనె ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ స్పష్టం చేసింది.

సింథటిక్ మరియు వెజిటబుల్ ఆయిల్: సరఫరా అయినది అసలైన ఆవు నెయ్యి కాదని, అది పూర్తిగా కృత్రిమంగా (Synthetic) తయారు చేసినదని పేర్కొంది. పామాయిల్ (Palm Oil), పామ్ కెర్నల్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్ కలిపి నెయ్యిలా మార్చారని విచారణలో తేలింది.

పాలు లేకుండానే నెయ్యి తయారీ: 2019 నుండి 2024 మధ్య కాలంలో నిందితులు పాలను సేకరించకుండానే, కెమికల్స్ మరియు వెజిటబుల్ ఆయిల్స్ ఉపయోగించి సుమారు 68 లక్షల కేజీల నకిలీ నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది.

రూ. 250 కోట్ల కుంభకోణం: ఈ నకిలీ నెయ్యి సరఫరా ద్వారా సుమారు 250 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగినట్లు ఛార్జ్షీట్ పేర్కొంది.

36 మంది నిందితులు: ఈ కేసులో ఉత్తరాఖండ్కు చెందిన భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ యజమానులు పొమిల్ జైన్, విపిన్ జైన్ సహా మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో ఏఆర్ డెయిరీ (తమిళనాడు), వైష్ణవి డెయిరీ ప్రతినిధులు కూడా ఉన్నారు.

నిబంధనల ఉల్లంఘన: గత ప్రభుత్వ హయాంలో డెయిరీల ఎంపికలో టెండర్ నిబంధనలను సడలించారని (టర్నోవర్ రూ. 250 కోట్ల నుండి రూ. 150 కోట్లకు తగ్గించడం వంటివి), ఇది కల్తీ నెయ్యి సరఫరాకు దారితీసిందని సిట్ నివేదిక వెల్లడించింది.

Share
Share