- సీఎం రాక పైన సర్వాత్రా ఆసక్తి !
- రేపు మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి సభ
- మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తిరేపుతున్న సీఎం టూర్
- ఎన్నికల కోడ్ నేపథ్యంలో హామీలు లేనట్టే?
- ఫించన్లు, కల్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్లు, తులం బంగారం హామీల పైన ఎమ్మెల్యేలకు నిరసన సెగ
- మంత్రులకు నిధులు, ఎమ్మెల్యేలకు నిరసనలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిర్యాలగూడెంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీఎం పర్యటనలో ఎలాంటి హామీలు ఇచ్చేందుకు వీల్లేదు. గత రెండేళ్లలో పార్టీ అమలు చేసిన కార్యక్రమాల గురించి వివరించడం, రాజకీయ విమర్శలు మినహా కొత్తగా మిర్యాలగూడకు వరాలు ఇచ్చే అవకాశం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ మున్సిపాలిటీ వెనకబడి ఉందని ఇంటిలిజెన్స్ నివేధికలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన పైన పార్టీ కేడర్ ఆశలు పెట్టుకుంది.

గత రెండేళ్లలో సీఎం నల్గొండ, దేవరకొండ, హు జూర్నగర్, ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంగా లెక్కలేనన్నీ హామీలు ఇచ్చారు. రేషన్ కార్డు లు, సన్నబియ్యం వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలు ఇక్కడి నుంచే ప్రారంభించారు. కానీ మంత్రుల నియోజకవర్గాలకు ఇచ్చిన అన్నీ నిధులు ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మిర్యాలగూడలో పూర్తియిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు వస్తున్నాయని నోటిఫికేషన్ కు ముందు జనాల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో మరింత అభాసుపాలయ్యారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చివరకు మున్సిపల్ అభ్యర్థుల ఎంపికలో సైతం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన కుటుంబ సభ్యులను అడ్డంపెట్టుకుని పెద్ద హైడ్రామా నడిపించడం పట్ల సొంత పార్టీ లీడర్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రులకు నిధులు.. ఎమ్మెల్యేలకు నిరసనలు
జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత మున్సిపాలిటీల్లో వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నల్లగొండలో రెండు వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గొప్పగా ప్రచారం చేస్తున్నారు. హుజూర్నగర్లో పేదలకు రెండు వేల ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పిన మంత్రి ఉత్తమ్ జనాల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి మంగళవారం నుంచి నల్లగొండలో రోడ్షో మొదలు పెట్టారు. కానీ ఇదే జోష్ మిగితా నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఎమ్మెల్యేలకు ఎక్కడకు వెళ్లిన నిరసనలు ఎదరువుతున్నాయి. ప్రధానంగా నాలుగు వేల ఫించన్లు, మహాలక్ష్మి స్కీం కింద నెలకు రూ.2500, తులం బంగారం, వరి పంటకు బోనస్, రైతుభరోసా, రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో ఆపేసిన పనులకు కొత్తగా కలరింగ్ చేసి ఎమ్మెల్యేలు గొప్పులు చెప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యేలు జనాలకు వివరిస్తున్నారు. బాకీ కార్డు ముద్రించి గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్లో సంచలన వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిధుల వివక్ష గురించి త్వరలో బాంబ్ పేలుస్తానని హాట్ కామెంట్స్ చేయడం మరింత కలకలం రేపింది.