- నీళ్ల పేరుతొ 10 ఏళ్ల మోసం..
- దక్షిణ తెలంగాణపై బారాస పాలన చేసిన ద్రోహం బట్టబయలు.
- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై డా. రేఖ బోయలపల్లి ఫైర్
ఏపీబీ న్యూస్(హైదరాబాద్): దక్షిణ తెలంగాణకు సాగునీరు అందిస్తామన్న హామీలతో అధికారంలోకి వచ్చిన BRS ప్రభుత్వం పదేళ్ల పాలన తర్వాత కూడా ప్రజలకు జవాబుల కంటే ప్రశ్నలే మిగిల్చింది అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి విమర్శించారు. గత ప్రభుత్వం పాలమూరు,రంగారెడ్డి, దిండీ, SLBC, నెట్టెంపాడు వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ రైతులకు జీవనాధారంగా చూపించినా, వాస్తవంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఒక్క ఎకరాకు కూడా గ్యారంటీ నీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, SLBC వంటి ప్రాజెక్టులు అన్నీ పాలమూరు–రంగారెడ్డి మీద ఆధారపడి ఉన్నవే, కానీ ఆ ప్రధాన ప్రాజెక్టే పూర్తి కాకపోవడం వల్ల దక్షిణ తెలంగాణ రైతులు వర్షాధార వ్యవసాయానికి పరిమితమయ్యారు,ఫలితంగా అప్పులు పెరిగాయి, రైతుల కష్టాలు తీవ్రమయ్యాయి అని గుర్తు చేశారు. ఇది చాలదన్నట్లు, కృష్ణా నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంలో కూడా గత బారాస ప్రభుత్వం ఘోర వైఫల్యం చూపింది అని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే సరిపెట్టడం, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అధికంగా నీళ్లు వినియోగించుకోవడం ఇది దక్షిణ తెలంగాణ ప్రయోజనాలపై జరిగిన తీవ్ర ద్రోహం అన్నారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడుతూ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముందుకు పోతుంటే బారాస నేతలు ప్రశ్నలు సంధించడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని చెప్పారు.ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసి, రైతులకు సాగు నీరు ఇవ్వలేని మీ పాలనకు ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు అని అన్నారు.