Breaking News: విశాఖలో ‘శ్రద్ధా వాకర్’ తరహా దారుణం: ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన నేవీ ఉద్యోగి!

విశాఖపట్నం, ఏపీబీ న్యూస్: విశాఖపట్నం జిల్లా గాజువాకలో సభ్య సమాజం తలదించుకునే ఘోర కలి వెలుగుచూసింది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీయడమే కాకుండా, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచేలా చేసింది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఉదంతాన్ని తలపించేలా ఉన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

విశాఖలోని ఎల్వీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రవీంద్ర అనే వ్యక్తి నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లై భార్య ఉంది. అయితే, మౌనిక (28) అనే మహిళతో రవీంద్రకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో, అతను ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి మౌనికను తన ఇంటికి రప్పించుకున్నాడు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆదివారం (మార్చి 29) సాయంత్రం వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. మౌనిక తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ కోపంలోనే తాను ఈ దారుణానికి ఒడిగట్టానని నిందితుడు రవీంద్ర పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

  • కిరాతకం: గొడవ ముదరడంతో రవీంద్ర కత్తితో మౌనికను హతమార్చాడు. అనంతరం సాక్ష్యాధారాలు దొరక్కుండా చేసేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు.
  • ఫ్రిడ్జ్లో శరీర భాగాలు: సగం శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ఫ్రిడ్జ్లో దాచగా, మిగిలిన భాగాలను మూటకట్టి ఇంటి మూలలో ఉంచాడు.
  • లొంగిపోయిన నిందితుడు: తన నేరాన్ని దాచలేనని భావించిన రవీంద్ర, స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహ భాగాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, మౌనిక తల మాత్రం ఇంకా లభ్యం కాలేదని సమాచారం. నిందితుడు తలని ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో పారవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Information: సోమవారం ఉదయం విశాఖ సమీపంలోని ధారపాలెం వద్ద మౌనిక తలను పోలీసులు గుర్తించారు. నిందితుడు రవీంద్ర మృతదేహాన్ని ముక్కలు చేసిన అనంతరం, సాక్ష్యాధారాలు దొరక్కుండా ఉండేందుకు తల భాగాన్ని దూరంగా పారవేసినట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై దర్యాప్తును మరింత ఉధృతం చేశారు. తల భాగాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పూర్తిస్థాయి నివేదిక కోసం వేచి చూస్తున్నారు.

విశాఖలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక హత్య మాత్రమే కాదు, మనిషిలోని వికృతత్వానికి నిదర్శనం. వివాహేతర సంబంధాలు ఏ స్థాయికి దిగజారుస్తున్నాయో ఈ ఉదంతం చెబుతోంది. సాంకేతికత పెరిగిన ఈ కాలంలో నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిందితులు సినిమాల్లో చూపినట్లుగా మృతదేహాలను ముక్కలు చేయడం, ఫ్రిడ్జ్ల్లో దాచడం వంటి పద్ధతులు అవలంబిస్తున్నారు. అయితే, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని నిందితుడు లొంగిపోవడమే నిరూపిస్తోంది. ఇలాంటి కిరాతకులకు కఠిన శిక్ష పడితేనే బాధితురాలికి న్యాయం జరుగుతుంది.

Share
Share