తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర రోడ్లు మరియు రవాణా మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ ని హైదరాబాద్ లో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసారు. ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను ఎంపి చామల వారికి వివరించారు…
యాదగిరిగుట్ట కారిడార్ అభివృద్ధిపై చర్చ
భువనగిరి పార్లమెంటు పరిధిలోని యాదగిరిగుట్ట ఆలయ పరిసర కారిడార్ ప్రాంతంలోని రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. ప్రాచీన దేవాలయాలు మరియు వారసత్వ గ్రామాల మధ్య సరైన రహదారి కనెక్టివిటీ లేకపోవడం వల్ల భక్తులు మరియు పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట, కొలనుపాక, కీసరగుట్ట, పెంబర్తి ప్రాంతాల మధ్య కనెక్టివిటీ లోపం గురించి వివరించారు.

రహదారి అభివృద్ధి ప్రతిపాదనలు
భువనగిరి పార్లమెంట్ పరిధిలోనీ రెండు ప్రధాన రహదారి అభివృద్ధి ప్రతిపాదనల గురించి కేంద్ర మంత్రికి ఎంపి కిరణ్ వివరించారు:
1) ఔటర్ రింగ్ రోడ్ నుండి పెంబర్తి వరకు రహదారి అభివృద్ధి
(ఎగ్జిట్ 8 – కీసార జంక్షన్ → యాదగిరిగుట్ట → కోలనపాక → పెంబర్తి) ఈ మార్గం యాదగిరిగుట్ట ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని, వరంగల్ మరియు కరీంనగర్ హైవేలపై ట్రాఫిక్ను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుందని వివరించారు..
2) ఆలేరు నుండి బచ్చన్నపేట వరకు లింక్ రోడ్ నిర్మాణం (NH-163 మరియు NH-365B అనుసంధానం) ఇది కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి దగ్గరలో ఉంది, భక్తులకు రాకపోకలలో సౌలభ్యత కలిగిస్తుందని తెలిపారు…
బ్లాక్ స్పాట్ పరిష్కార పనులపై సూచనలు
హైదరాబాద్ – యాదగిరిగుట్ట రహదారి విభాగంలో ఇప్పటికే ఆమోదించబడిన క్రింది కీలకమైన బ్లాక్ స్పాట్ పరిష్కార పనులకు తక్షణ అనుమతి మరియు వేగవంతమైన ప్రక్రియ కోసం లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు:
- ఎన్టీపీసీ ఎక్స్ రోడ్ వెహిక్యులర్ అండర్ పాస్ (అన్నోజిగూడ జంక్షన్)
- ఘట్కేసర్ VUP
- ఘట్టుమైసమ్మ LVUP
- అంకుషాపూర్ VUP
- కొండమడుగు LVUP
- ఎయిమ్స్ బిబినగర్ వెహిక్యులర్ అండర్ పాస్ & లైట్ వెహిక్యులర్ అండర్ పాస్
- సింగనగూడెం అండర్ పాస్
ఈ పనులు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సమస్యలు మరియు ప్రాణ నష్టం నివారణకు కీలకమైనవని ఎంపీ కిరణ్ పేర్కొన్నారు.

ఎలివేటెడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం అవసరం
రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్ద అంబర్పేట్ మరియు లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతాల్లో రెండు ఎలివేటెడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి సంబంధించి ఎంపీ చామల కిరణ్ కేంద్ర మంత్రిని కోరారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో 100కి పైగా కాలనీలు ఏర్పడటంతో, ప్రజలు తీవ్రమైన రవాణా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వయోజనులు, విద్యార్థులు రోజూ 1–2 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజల సౌకర్యం మరియు భద్రత దృష్ట్యా పెద్ద అంబర్ పేట, లక్ష్మారెడ్డిపాలెం లలో రెండు ఎలివేటెడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను వెంటనే మంజూరు ఇవ్వాలని కోరారు. ఎంపి చామల ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.