- కార్పోరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి
- సింగిల్ హ్యాండ్తో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే ప్లాన్
- పాత వెంకటరెడ్డిని గుర్తు చేసుకుంటున్న జనం
- అభ్యర్థుల ఎంపిక మొదలు.. వివిధ వర్గాలతో నేరుగా చర్చలు
- ద్వితీయ శ్రేణీ నాయకుల పైన సన్నగిల్లిన నమ్మకం
- సామాజిక వర్గాల వారీగా టికెట్ల కేటాయింపు పూర్తి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ జనం బాట పట్టారు. ఉమ్మడి జిల్లాలో కార్పోరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకున్న మంత్రి భారీ మెజార్టీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే పనిలో పడ్డారు. 45 డివిజన్లలో గెలుపొందాలన్నది మంత్రి టార్గెట్. ఈ మేరకు నల్గొండలో చేపడుతున్న రెండు వేల కోట్ల అభివృద్ధి పనులనే ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు. కార్పోరేషన్ మారినందున కేంద్రం నిధులు భారీగా వస్తాయని, నిరుపేదలకు పూర్తిస్థాయి లో ఇళ్లు నిర్మిస్తానని మంత్రి హామీ ఇస్తున్నారు.

ద్వితీయ శ్రేణి కేడర్ పైన నమ్మకం లేకనే
ఎవరూ అడగకపోయిన నల్లగొండను కార్పోరేషన్గా చేశానని చెప్పిన వెంకటరెడ్డి ఆ మేరకు గెలుపు బాధ్యతలు కూడా ఆయనే భుజానకెత్తుకున్నారు. దీనికోసం ద్వితీయశ్రేణి పార్టీ కేడర్ను సైతం సైడ్ చేశారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్లో ద్వితీయ శ్రేణి నాయకత్వ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. ఈ ప్రభావం ఎన్నికల్లో కనిపించొద్దనే అభిప్రాయంతో మంత్రి స్వయంగా కిందిస్థాయిలో పార్టీకి విధేయులైన కార్యకర్తలకు ఫోన్ చేసి తాజా పరిణామాల గురించి ఆరా తీస్తున్నారు. మూడు రోజుల క్రితం నల్లగొండలో పర్యటించిన మంత్రి సింగిల్ గానే ట్రాక్టర్ పైన నల్లగొండలో పర్యటించి హల్చల్ చేశారు. ఈ పర్యటన లో భాగంగా ఆయన వెంట తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి తప్పా పట్టణానికి చెందిన వేరొక నాయకుడు కనిపించకపోవడం ఆశ్యర్యానికి గురిచేసింది. అంతే గాక పట్టణంలో వివిధ వర్గాల ప్రజలు, కమ్యూనిటీ లీడర్లతో నేరుగా మాటామంతీ సాగిస్తున్నారు. ముస్లిం మైనార్టీలు, బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల లీడర్లు, ప్రజలతో మంత్రి నేరుగా సంభాషిస్తున్నారు. మళ్లీ బుధవారం బొట్టుగూడ స్కూల్ను ప్రారంభించిన మంత్రి నల్లగొండ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో పట్టణవాసులు పాత వెంకటరెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు జనం మనిషిగా గుర్తింపు పొందిన వెంకన్న మళ్లీ అదే పంథాలో జనంలోకి ప్రవేశించడంతో పార్టీ కేడర్లో జోష్ నెలకొంది.

అన్నీ తానై వ్యవహారిస్తున్న మంత్రి
అభ్యర్థుల ఎంపిక మొదలు, వివిధ వర్గాల ప్రజలతో నేరుగా మంతనాలు జరపడం వరకు మంత్రి అన్నీతానై వ్యవహారిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఐదుగురు అభ్యర్థులను ప్రకటించినప్పుడు కూడా మంత్రి వెంట కీలక నాయకులు ఎవరూ కనిపించలేదు. అంతేగాక బుధవారం బొట్టుగూడ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా మంత్రి ఒక్కరే హల్చల్ చేశారు. నల్లగొండకు మంత్రి వచ్చిన ప్రతిసారీ హల్చల్ చేసే ద్వితీయ శ్రేణి నాయకులు ఆమడదూరంలోనే కనిపించారు. ఇన్నాళ్లు నల్లగొండ బాధ్యతలను ద్వితీయ శ్రేణి నాయకత్వాని కే వదిలేశారనే ఆపవాదను పూర్తిగా తుడిచిపెట్టేందుకే మంత్రి సింగిల్గా ఎంట్రీ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.

టికెట్ల కేటాయింపులో సామాజిక కూర్పు
నల్లగొండ మేయర్ పదవి ఎవరికి ఇవ్వాలనే దాంట్లో కూడా మంత్రి కోమటిరెడ్డి ఇప్పటికే క్లారిటితో ఉన్నారు. అధికారికంగా ఎవరి పేర్లు బయటకు చెప్పకపోయినప్పటికీ అభ్యర్థిని ప్రకటించే ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. 48 డివిజన్లలో బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డిలను మినహాయిస్తే 46 వార్డుల్లో యాదవులకు 7 డివిజన్లు, ముస్లిం మైనార్టీలకు 11, జనరల్కు 6 డివిజన్లు ఖరారు చేసినట్టు తెలిసింది. డెప్యూటీ మేయర్ పదవి ముస్లింలకు కేటాయించనున్నారు. నుడా కార్పోరేషన్ పదవి అబ్బగోని రమేష్ గౌడ్ కు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. మెజార్టీ కౌన్సిలర్లు బుర్రి శ్రీనివాస్ రెడ్డినే మేయర్కు ప్రతిపాధిస్తున్నప్పటికీ, మోహన్ రెడ్డి పోటీ పడుతున్నట్టు తెలిసింది. మేయర్ ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకే మంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఒకవేళ శ్రీనివాస్ రెడ్డిని మేయర్ చేస్తే, మోహన్ రెడ్డికి స్టేట్ కార్పోరేషన్ పదవి ఇవ్వనున్నారు.
