హైదరాబాద్, ఏపీబీ న్యూస్: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా మరియు కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో తన రాజ్యసభ సభ్యత్వంపై వస్తున్న కథనాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవ రావు (KK) ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఆయన తేల్చి చెప్పారు.
పదవులపై ఆసక్తి లేదు..
గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. “నేను రాజ్యసభ పోటీలో లేను. దీని గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నాకు మళ్లీ ఎంపీ పదవి చేపట్టాలనే ఆలోచన గానీ, ఆసక్తి గానీ లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
రెండేళ్ల క్రితమే రాజీనామా..
తమ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్న కేశవ రావు, తాను సుమారు రెండున్నర సంవత్సరాల క్రితమే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో పార్టీ మారిన నేపథ్యంలో, నైతిక బాధ్యతగా ఆ పదవిని వదులుకున్నానని, ఇప్పుడు మళ్లీ అదే స్థానం కోసం ప్రయత్నిస్తున్నాననే వార్తలు రావడం శోచనీయమని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సలహాదారుగా సేవలు..
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (Public Affairs) బాధ్యతలు నిర్వహిస్తున్న కేకే, ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి పదవులు ఒక్కటే మార్గం కాదని, ప్రస్తుతం ఉన్న హోదాలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. నిరాధారమైన వార్తలను ప్రచురించి ప్రజలను, రాజకీయ శ్రేణులను గందరగోళానికి గురి చేయవద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.