Breaking News: హైదరాబాద్‌లో భూప్రకంపనలు: భయాందోళనలో స్థానికులు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: నగరంలోని గాజులరామారం పరిధిలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చింతల్ సమీపంలోని మెట్ఖాన్గూడా ప్రాంతంలో ఉదయం సుమారు 10:10 గంటల సమయంలో భారీ శబ్దంతో కూడిన ప్రకంపనలు సంభవించాయి.

ప్రకంపనల తీవ్రతకు మెట్ఖాన్గూడాలోని పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. సెకన్ల పాటు భూమి కదిలినట్లు అనిపించడంతో పాటు, పెద్ద శబ్దం రావడంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం ఆందోళన చెందారు. ఇంట్లోని సామాగ్రి కదలడం గమనించినట్లు కొందరు స్థానికులు తెలిపారు.

ఈ ప్రకంపనలకు గల ఖచ్చితమైన కారణంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఇది భూకంపం వల్ల వచ్చిన శబ్దమా లేక సమీపంలోని క్వారీలు లేదా నిర్మాణ ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిన ప్రకంపనలా అనే కోణంలో చర్చ జరుగుతోంది.

  • సమయం: ఉదయం 10:10 గంటలకు.
  • ప్రాంతం: మెట్ఖాన్గూడా, గాజులరామారం, హైదరాబాద్.
  • ప్రభావం: బహుళ అంతస్తుల భవనాల నుంచి బయటకు వచ్చిన నివాసితులు.

ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. అధికారులు ఈ ఘటనపై స్పందించి, ప్రకంపనలకు గల కారణాలను విశ్లేషించాల్సి ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Share
Share