- పదేళ్లలో రూ.856.30 కోట్ల అభివృద్ధి
- ప్రగతి నివేధికను వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
- కాంగ్రెస్ అభివృద్ధి ఎక్కడో చెప్పాలని సవాల్
- సీఎం చెప్పిన రూ.295 కోట్లు ఎక్కడిచ్చారని నిలదీత
- వేడెక్కిన మున్సిపల్ పోరు
మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృద్ధి పైన అధికార, ప్రతిపక్ష పార్టీ ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సభలో మిర్యాలగూడెం పట్టణానికి రూ.295 కోట్లు విడుదల చేశామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిధులు ఎక్కడ, ఎవరి కోసం ఖర్చు పెట్టారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు సవాల్ విసురుతున్నారు. పదవుల కోసం పాకులాట తప్పా అభివృద్ధి పైన ధ్యాసేలేదని, నిజంగా అభివృద్ధి చేసి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరో 24 గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో గత పదేళ్లలో చేసిన పట్టణాభివృద్ధి నివేధికను ఎన్నికల చివరి అస్త్రంగా ప్రయోగించారు. పదేళ్లలో మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు రూ.856.30 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు, పట్టణ ప్రజల మౌలిక వసతుల కల్పనలో భాగంగా డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, తాగునీరు, జంక్షన్ల ఏర్పాటు, వివిధ కులాలకు కమ్యూనిటీ హాల్స్, మినీ కళాభారతి, శ్మశాన వాటికలు నిర్మించానని ప్రజలకు వివరిస్తున్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టణ ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని సవాల్ విసురుతున్నారు.
గూడెం రూపు రేఖలు మార్చినం
పదేళ్లలో మిర్యాలగూడెం రూపు రేఖలు మార్చామని మాజీ ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా రూ.10.15 కోట్లతో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు అభివృద్ధి చేశామని, రూ.174.11 కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపట్టామని, తద్వారా పట్టణ ప్రజలకు పుష్కలంగా తాగునీరు సరఫరా జరుగుతోందని చెపుతున్నారు. రూ.31.29 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధికి ఖర్చు పెట్టారు. రూ.210 కోట్లతో సంతుసేవాల్, అంబేద్కర్ భవనాల నిర్మాణం, రోడ్లు విస్తరణ, ఫుట్ పాత్ లు, క్రిస్టియన్లకు శ్మశాన వాటిక, మైనార్టీలకు షాదీఖాన, రైల్వే ట్రాక్ నుంచి రాజీవ్ చౌక్ , ఈదులగూడ వరకు రోడ్డు విస్తరణ, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, నల్లగొండ బైపాస్ జంక్షన్, మైనార్టీలకు కబరస్థాన్, అవుట్ డోర్ స్టేడియం, మినీ కళాభారతి, వ్యాయమా శాలలు, 48 వార్డులకు లింక్ రోడ్లు, వెజ, నాన్ వెజ్ మార్కెట్లు, రూ.83.96కోట్ల తో కొత్త కరెంట్ స్తంబాలు ఏర్పాటు, రూ.45.83కోట్ల తో సబ్స్టేషన్లు, రూ.2.45 కోట్లతో బంగారిగడ్డ బ్రిడ్జినిర్మాణం, రూ.6.10కోట్లతో సాగర్ రోడ్డు విస్తరణ, రూ.29.68 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, రూ.4.95కోట్లతో ఎన్ఎస్పీ(NSP) క్యాంప్ లో గ్రౌండ్ లో మౌలిక వసతుల కల్పన, రూ.1.50కోట్లతో ఆర్ అండ్ బీ, మున్సిపల్ శాఖల సమన్వయంతో ఇందిరమ్మ కాలనీ, నందిపహాడ్ రోడ్డు నిర్మాణం, రూ. 28.43 కోట్లతో ప్రభుత్వ బడులను రిపేర్లు చేయించామని మాజీ ఎమ్మెల్యే ప్రజలకు వివరిస్తున్నారు.
2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు
| పథకం పేరు | ఖర్చు |
| ఆసరా ఫించన్లు | రూ. 202.58 కోట్లు |
| సీఎంఆర్ఎఫ్ | రూ. 7.41 కోట్లు |
| కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ | రూ. 31.85 కోట్లు |
| కేసీఆర్ కిట్లు | రూ. 92.59 లక్షలు |
| బాలిక ఆరోగ్యం | రూ. 1.5 కోట్లు |
| బతుకమ్మ చీరలు | రూ. 5.49 కోట్లు |
| గురుకులాల అభివృద్ధి | రూ. 63.48 కోట్లు |
| ఎస్సీ హాస్టళ్ల అభివృద్ధి | రూ. 77.71 కోట్లు |
| దళిత బందు | రూ. 21.10 కోట్లు |
| మరుగుదొడ్లు | రూ. 3.7 కోట్లు |
| మైనార్టీ లోన్లు | రూ. 48 లక్షలు |
| గృహలక్ష్మీ | రూ. 36.72 కోట్లు |
| బీసీ బంధు | రూ. 1.18 కోట్లు |
| ఎస్సీ కార్పోరేషన్ | రూ. 2.40 కోట్లు |
| డబుల్ బెడ్రూమ్ | రూ. 29.68 కోట్లు |