హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని మున్సిపాలిటీ లలో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలోని వార్డులలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
భారత ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాను టి ఈ పోల్ పోర్టల్ లో అందుబాటులో ఉంచడం జరిగిందని, అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల వారిగా ఓటరు జాబితా ఉంటుందని, మున్సిపల్ కమిషనర్లు తమ వివరాలతో లాగిన్ తీసుకొని వారికి సంబంధించిన మున్సిపల్ ఓటర్లను వార్డుల వారిగా మ్యాపింగ్ చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ చేపట్టాలని, ఈ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత నోడల్ అధికారి ద్వారా నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
