Breaking News: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్ నన్ను వదులుకుని తప్పు చేశారు!

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ శనివారం శామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న పార్టీ మార్పు వార్తలను తీవ్రంగా ఖండిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గత బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు.

తానూ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఈటల స్పందిస్తూ.. “పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత సులభం కాదు. నన్ను బీఆర్ఎస్ నుండి పంపించి ఐదేళ్లు అవుతోంది. నేను బీజేపీలోనే ఉంటాను. నా గురించి తెలంగాణ సమాజానికి తెలుసు, ఇలాంటి పిచ్చి వార్తలు నమ్మకండి” అని హితవు పలికారు. కేసీఆర్ తనను వదులుకుని పెద్ద తప్పు చేశారని ప్రజలే చర్చించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో కేసీఆర్ తనను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈటల గుర్తు చేసుకున్నారు. “నన్ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయడమే కాకుండా, నా కోళ్ల ఫారాలను కూల్చారు, నేను లీగల్గా కొనుక్కున్న భూములను గుంజుకున్నారు. ఇవన్నీ చేసిన వారితో మళ్ళీ కలిసే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. త్వరలోనే తన భూముల సమస్యపై సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు.

ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ఈటల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు:

అబద్ధాల పునాదులు: రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదుల మీద గెలిచారని, ఇప్పుడు కూడా అదే అబద్ధాలతో బుకాయిస్తూ పాలిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు లేవు?: గత ప్రభుత్వంలో దోచుకున్నది అంతా కక్కిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కోర్టులను కూడా మేనేజ్ చేసే స్థాయికి ఈ ప్రభుత్వం వచ్చిందని ఆరోపించారు.

సిఎం వ్యాఖ్యలు: సీఎం రేవంత్ రెడ్డి ‘బక్వాస్’ మాటలు మాట్లాడుతున్నారని, భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈటల స్పష్టతనిచ్చారు. “మేము ఆరుగురు బీజేపీ ఎంపీలము, మా ఎమ్మెల్యేలము కలిసి సమన్వయంతో పని చేయబోతున్నాం. బాలాజీ నగర్ చలో కార్యక్రమంతో మా కార్యాచరణ మొదలవుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో గెలిచే వారికే టికెట్లు ఇస్తాం, సర్వేల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి” అని స్పష్టం చేశారు.

ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఆయన నిబద్ధతను చాటిచెబుతున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉన్నా, ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చి బీజేపీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీగా ఉంటూనే, గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండింటినీ సమానంగా టార్గెట్ చేయడం ద్వారా బీజేపీని ప్రధాన ప్రత్యామ్నాయంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.

Share
Share