- నామినేటెడ్ పోస్టు రేసులో దుబ్బాక!
- కీలకనేతల మద్ధతు కూడగడుతున్న సీనియర్ నేత దుబ్బాక నర్సింహారెడ్డి
- ఎస్సీ కోటాలో పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య
నల్లగొండ ప్రతినిధి, ఏబీపీ న్యూస్: ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత దుబ్బాక నర్సింహారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దుబ్బాక అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన దుబ్బాక చివరి నిమిషంలో పార్టీ హైకమాండ్ హ్యాండిచ్చింది. కంచర్ల భూపాల్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో దుబ్బాక కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత గులాబ్నబీ ఆజాద్ స్వయంగా నల్లగొండకు వచ్చి దుబ్బాకను పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి పార్టీ విధేయుడిగా కొనసాగుతున్న దుబ్బాక హైదరాబాద్ కేంద్రంగా పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే దుబ్బాకకు నామినేటెడ్ పదవి వస్తదని ఆశించారు. కానీ సమీకరణాలు కుదరకపోవడంతో ఆలస్యమైంది. ఈ నెలాఖరు లేదంటే కొత్త ఏడాది ఆరంభంలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన సంగతి తెలిసింది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లా నుంచి నామినేటెడ్ పదవులు పొందిన చైర్మన్లు, డైరక్టర్ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. వాళ్ల స్థానంలో కొత్తవాళ్లకు చోటు కల్పించేందుకు పైస్థాయిలో కార్యచరణ సిద్ధమవుతోంది. ఇటీవల మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ జిల్లాకు చెందిన ఆశావహులతో చర్చించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక జిల్లా ముఖ్యనేతలను సంప్రదించి మద్ధతు కూడగడుతున్నట్టు తెలిసింది.
ఎస్సీ కోటాలో కొండేటి…
ఎస్సీ కోటాలో పీసీసీ ఉపాధ్యక్షడు కొండేటి మల్లయ్య సైతం కార్పోరేషన్ రేసులో ఉన్నారు. ఇప్పటికే అనేక ఛాన్స్లు మిస్సైన మల్లయ్య ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. సీనియర్ నేత జానా రెడ్డి ప్రధాన అనుచరుడైన మల్లయ్య నకిరేకల్ ఎమ్మెల్యే సీటు కోసం గత మూడు టర్మ్ల నుంచి తీవ్రంగానే ప్రయత్నించారు. ఇటీవల జరిగిన డీసీసీ పదవుల నియామకాల్లోనూ ఆయన పేరు వినిపించింది. కానీ సామాజిక సమీకరణాల కుదరలేదు. పైగా ఎస్సీ మాదిగ సామాజికవర్గం కోటాలో నల్లగొండ జిల్లాకు ప్రయార్టీ ఇవ్వాలనే హైకమాండ్ ఆలోచిస్తోంది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సపోర్ట్ మల్లయ్యకు ఉండటంతో ఈ దఫా లైన్క్లియర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.