- రూ. 20 వేల వరకు అక్రమ వసూళ్లు!
- ఇంటర్ బోర్డు నిబంధనలు తుంగలో తొక్కి ముందస్తు అడ్మిషన్లు
- ఫీజుల రాయితీ, స్కాలర్షిప్ టెస్టుల పేరిట తల్లిదండ్రులకు మాయమాటలు
- నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీలపై చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నేటితో ముగియడంతో కార్పొరేట్ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తమ అడ్మిషన్ల వేటను ముమ్మరం చేశాయి. కనీసం ఫలితాలు కూడా రాకముందే, ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను బేఖాతరు చేస్తూ ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మభ్యపెట్టి.. వసూలు చేసి:
పది ఫలితాల తర్వాత ఫీజులు పెరుగుతాయని, ఇప్పుడే సీటు రిజర్వ్ చేసుకుంటే భారీ రాయితీలు ఇస్తామని కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి.
- రిజర్వేషన్ ఫీజు: సీటు కన్ఫర్మ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 వేల నుండి రూ. 20 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు.
- మెరిట్ జాలం: గత రెండు నెలలుగా స్కాలర్షిప్ టెస్టులు నిర్వహిస్తూ మెరిట్ విద్యార్థులను ఆకర్షించి, పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నారు.
- పీఆర్వోల ఒత్తిడి: కాలేజీల పీఆర్వోలు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, ఆకర్షణీయమైన ప్రకటనలతో తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు.
లక్షల్లో ఫీజులు – రంగుల ప్రకటనలు:
జేఈఈ (JEE), నీట్ (NEET), ఎప్సెట్ (EAPCET) కోచింగ్ పేరిట లక్షల్లో ఫీజులు దండుకుంటున్నాయి. భారీ హోర్డింగ్లు, రంగుల ప్రకటనలతో తామే నెంబర్ వన్ అని ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా, ఈ కార్పొరేట్ మాయాజాలంలో పడి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్:
నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంబీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ. బడే సాబ్, బీసీ యువజన సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అనంతుల రామ్మూర్తి గౌడ్ డిమాండ్ చేశారు.
జరిమానా విధించాలి: ఇంటర్ బోర్డు అధికారులు తక్షణమే స్పందించి అక్రమ అడ్మిషన్లను అరికట్టాలని, నిబంధనలు పాటించని యాజమాన్యాలకు భారీ జరిమానా విధించాలని డిమాండ్ చేశారు.
విద్య వ్యాపారం కావొద్దు..
ప్రతి ఏటా ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేస్తున్నా, క్షేత్రస్థాయిలో కార్పొరేట్ కాలేజీల ఆగడాలు తగ్గడం లేదు. పదో తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్లు తీసుకోవడం చట్టవిరుద్ధం. తల్లిదండ్రులు కూడా తొందరపడి ఇలాంటి ప్రలోభాలకు లోనుకావొద్దని ఏపీబీ న్యూస్ కోరుతోంది. అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఈ దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది.