పంచాయతీ ఎన్నికల్లో.. కొత్త ఎమ్మెల్యేలకు ఎదురుగాలి!

  • ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్​, నకిరేకల్​లో బీఆర్​ఎస్​తో కష్టమే
  • 432 కాంగ్రెస్​, 240 గ్రామాలు బీఆర్​ఎస్​ కైవసం
  • 23 మండలాల్లో గులాబి శ్రేణుల ప్రభావం
  • సొంత పార్టీ కేడర్​ను సమన్వయం చేయడంలో ఫెయిల్​

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్:​ 

కాంగ్రెస్​ పార్టీ నుంచి తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డుస్థాయి మెజార్టీ సాధించిన కొత్త ఎమ్మెల్యేలకు పల్లె ఓటర్లు గట్టిషాక్​ ఇచ్చారు. కాంగ్రెస్​కు ధీటుగా బీఆర్ఎస్​ మద్ధతుదారులు గెలుపొందడం ఎమ్మెల్యేలకు అస్సలు మింగుడుపడట్లేదు. కొత్త ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనే సంగతిని గ్రహించిన బీఆర్​ఎస్ మాజీ ఎమ్మె ల్యేలు తమ మద్ధతుదారులను గెలిపించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహారించారు. అసలు కొన్ని చోట్ల మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేయని గ్రామాల్లో సైతం బీఆర్​ఎస్​ సపోర్టర్స్​ గెలవడం ఎమ్మెల్యే లను ఆశ్చర్యానికి గురిచేసింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికైన వారికి స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. దీంతో లోకల్​ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడంలో, కేడర్​ను సమన్వయం చేయడంలో ఫెయిలైనట్టు ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తోంది. ఎన్నికల్లో తమ అనుచరులకు ఇచ్చిన ప్రయార్టీ గ్రామస్థాయిలో పట్టు ఉన్న పార్టీ సీనియర్లను పట్టించుకోకపోవడంతో పరోక్షంగా వారంతా బీఆర్​ఎస్​కు పనిచేశారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2వేలకు ఖర్చు పెట్టినప్పటికీ పల్లె ఓటర్లు మాత్రం తమకు నచ్చిన అభ్యర్థినే ఎన్నుకున్నారు.

రెండేళ్లకే ఎమ్మెల్యే పైన వ్యతిరేకత:

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్​ కంచుకోటగా ఉన్న జిల్లాలో బీఆర్​ఎస్​ మళ్లీ పట్టుబిగుస్తుందనే చర్చ నడుస్తోంది. ఆలేరులో బీర్ల అయిలయ్య, భువనగిరిలో కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి, తుంగతుర్తి మందుల సామేలు, నకిరేకల్​ వేముల వీరేశం, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్​ కుందురు జైవీర్ రెడ్డి తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. ఈ నియోజకవర్గాల్లో ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య గట్టిపోటీ జరిగిం ది. ఏకగ్రీవమైన పంచాయతీలను మినహాయిస్తే ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో బీఆర్​ఎస్ మద్ధతుదారులు సత్తా చాటారు. ముఖ్యంగా ఆలేరు, భువనగిరి, మిర్యాలగూడలో బీఆర్​ఎస్​ మెజార్టీ స్థానాలు సాధించింది. పార్టీ సింబల్​ లేకుండానే ప్రజలు ఈ రకమైన తీర్పును ఇవ్వడమంటే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ముందస్తు హెచ్చరిక ఇచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

nalgonda

కాంగ్రెస్​ 432…బీఆర్​ఎస్​ 240

ఆరు నియోజకవర్గాల్లో 23 మండలాల్లో బీఆర్​ఎస్​ గట్టిపోటీ ఇచ్చింది. ఈ మండలాల్లో మొత్తం 811 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్​ 432, బీఆర్​ఎస్​ మద్ధతుదారులు 240 పంచాయతీల్లో గెలుపొందారు. ప్రధానంగా భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్​ 56 పంచాయతీలు గెలిస్తే బీఆర్​ఎస్​ 55 మంది గెలుపొందడం విశేషం. ఇక ఆలేరులో 87 మంది కాంగ్రెస్​ సపోర్టర్స్​ గెలిస్తే బీఆర్​ఎస్​ 50 మంది మద్ధతుదారులు గెలుపొందారు. మూడో ప్లేస్​లో తుంగతుర్తిలో కాంగ్రెస్​ 76, బీఆర్​ఎస్​ 40, మిర్యాలగూడలో కాంగ్రెస్​ 72 గె లిస్తే, బీఆర్​ఎస్​ 36 గ్రామాల్లో గెలిచింది. నకిరేకల్​ సెగ్మెంట్​లో కాంగ్రెస్​లో 77, బీఆర్​ఎస్​ 31, నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​ 64, బీఆర్​ఎస్​ 28 మంది మద్ధతుదారులు గెలుపొందారు. ఏకగ్రీవం పోను ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో సాధించిన ఫలితాలు.

23 మండలాలు ఇవీ…

తుంగతుర్తి సెగ్మెంట్​లో అర్వపల్లి, నూతనకల్​, మద్దిరాల, శాలిగౌరారం మండలాల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులు సత్తా చాటారు. అట్లాగే ఆలేరులో ఆలేరు, రాజాపేట, బొమ్మలరామారాం, ఆత్మకూరు (ఎం), యాదగిరిగుట్ట, నకిరేకల్​లో నార్కట్​పల్లి, కట్టంగూరు, చిట్యాల, రామన్నపేట మండలాల్లో కాంగ్రెస్​కు ధీటుగా బీఆర్​ఎస్​ అభ్యర్థులు గెలుపొందారు. భువనగిరి సెగ్మెంట్​లో  మొత్తం నాలుగు మండలాల్లో భువనగిరి, భూధాన్​ పోచంపల్లి, బీబీనగర్​, వలిగొండలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్ చెరోసగం స్థానాలు కైవసం చేసుకున్నారు. మిర్యాలగూడలో మిర్యాలగూడ మండలం, మాడ్గులపల్లి, దామరచర్ల, సాగర్​లో పెద్దవూర, త్రిపురారం, నిడమనూరు మండలాల్లో బీఆర్​ఎస్​ మెజార్టీ మద్ధతు దారులు గెలుపొందారు.

మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తులకు షాక్​​…

ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో మిర్యాలగూడలో బీఆర్​ఎస్​ గట్టిపోటీ ఇచ్చింది. దాదాపు అన్ని మండలాల్లో బీఆర్​ఎస్​ మద్ధతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్​ 72, బీఆర్​ఎస్​ 36 చోట్ల గెలుపొందగా, మరో నాలుగు పంచాయతీల్లో ‘టాస్’​ వల్ల ఫలితాన్ని కోల్పోయారు. ఇంకో 28 పంచాయతీల్లో అభ్యర్థులు 20 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు, అలాగే 70 ఓట్ల లోపు అభ్యర్ధులు 18 గ్రామ పంచాయతీల్లో ఓడిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం దాదాపు పది కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు తెలిసింది. అసలు పోటీ వద్దని చెప్పిన అడవిదేవులపల్లి గ్రామంలో సైతం కోటి రూపాయాలకు పైగా ఖర్చు చేశారు. పోలింగ్​కు ముందు ఓటర్లకు రెండువేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది. ఇంకోవైపు దామరచర్లలో ఎమ్మెల్సీ శంకర్​ నాయక్​ వర్గం నిలబడటంతో ఎమ్మెల్యే వర్గీయులు చాలెంజ్​ తీసుకోవాల్సి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే భాస్కర్​ రావు బీఆర్​ఎస్ మద్ధతుదారులను గెలిపించడంలో చాకచక్యంగా వ్యహరించారు. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి గ్రామంలో బీఆర్​ఎస్​ క్యాండేట్లు గెలుపొందడం విశేషం.

ఆరు సెగ్మెంట్లలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సాధించిన స్థానాలు (రెండు విడతల్లో)

నియోజకవర్గంమొత్తం జీపీలుకాంగ్రెస్బీఆర్​ఎస్​
భువనగిరి1265655
ఆలేరు1538750
తుంగతుర్తి1287640
మిర్యాలగూడ1347236
నకిరేకల్1027731
నాగార్జునసాగర్1486428
Share
Share