Breaking News: నక్కల జిత్తుల భాస్కర్​రావ్​! వీపు చింతపండు చేస్తా.. సీఎం మాస్ వార్నింగ్

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ‘నక్క జిత్తుల భాస్కర్రావ్..! నీ వీపు చింతపండు చేస్తా.. నామినేషన్ వేసిన మనోళ్లను వాపసు తీసుకోమని బెదిరిస్తున్నరట, నువ్వు అనుకుంటున్నవ్ భాస్కర్ రావు వీపు చింతపండు అయితది ఈ వేధిక మీద ఉన్నోళ్లు అంతా జానారెడ్డి లెక్క పెద్ద మనసు ఉన్నోళ్లం కాదు, నీ తెలివి తేటలు అన్నీ కట్టిపెట్టు, లేదంటే మళ్లీ ఖమ్మం పోతవ్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతకంటే ముందు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడలో భాస్కర్ రావు పెడుతున్న ఇబ్బందుల గురించి వేధిక పైన వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. దీని పైన తీవ్రంగా స్పందించిన సీఎం భాస్కర్రావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జానారెడ్డి చెప్పులు మోసినోడు, ఆయన ఇంట్లో నీళ్ల సీసాలు మోసినోడు కాదా ఈ భాస్కర్రావ్ అని నిప్పులు చెరిగారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని ఓడగొట్టేందుకు ఇల్లు ఇల్లు తిరిగి మోసం చేసిండు, ఇంతకంటే మోసగాళ్లు ఎవరైనా ఉంటడా? ఇలాంటోళ్లను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే మిర్యాలగూడ పరువే పోతది అని సీఎం అన్నారు. జానారెడ్డి కొడుకుని కాదని నిన్ను నమ్మి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేస్తే మిర్యాలగూడ ప్రజల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవెల్లి ఫాంహౌజ్లో, కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఈ భాస్కర్రావ్ మళ్లీ మీ దగ్గరకు వస్తుండు..? ఆయన మనకు నాయకుడు? ఆయన అవసరమా.? ఇయ్యాల నక్కల జిత్తుల భాస్కరావు మనోళ్లు నామినేషన్లు వేస్తే వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నరట, నీ తెలికి తేటలు కట్టిపెడితే మంచిది లేదంటే వీపు చింతపండు అయితదని సీఎం వార్నింగ్ ఇచ్చారు.

నువ్వేదో తెలివితేటలు అనుకుని ఇక్కడ ఉన్నోళ్లను బెదిరిస్తే జానారెడ్డి, సుఖేందర్ రెడ్డి, రఘువీర్ అడ్డం వస్తారని అనుకుంటున్నవ్, ఎవ్వరు అడ్డం రారు వాళ్లందరూ నాకు చెప్పిర్రు, నీవీపు పగాల్సిందే అని వాళ్లందరిని ఏం సంగతి అని అడిగితే ఇక ఏంలేదు వీపు చింతపండు చేయాల్సిందేనని చెప్పిర్రు. నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల పైన ఎలాంటి ఆలోచన, రద్ధీలేదని, నూటికి నూరుశాతం కాంగ్రెస్ గెలుస్తదనే నమ్మకం ఉందని అన్నారు.

miryalaguda public meeting 1

మిర్యాలగూడెం ఎమ్మెల్యే టికెట్ కావాలని బత్తుల లక్ష్మారెడ్డి, శంకర్ నాయక్, రఘువీర్రెడ్డి అడిగితే ముగ్గురికి మూడు పదవులు ఇచ్చినం, ఇంతటి ఘనత నా సొంత జిల్లా మహబూబ్నగర్లో కూడా లేదు. లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా, శంకర్ నాయక్ ఎమ్మెల్సీ, రఘువీర్ రెడ్డి ఎంపీ, ఇలా గూడెం ఎమ్మెల్యే సీటు అడిగిన ముగ్గురికి మూడు పదవులు కట్టిబెట్టిన చర్రిత దక్కింది. వీళ్లకు అధనంగా జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఉన్నరు. ఇంతటి బలమైన నాయకత్వం మరెక్కడా లేదు. కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదు. అని సీఎం భరోసా ఇచ్చారు.

Share
Share