చండూర్ , ఏపీబీ న్యూస్: చండూరు పట్టణంలో రాజకీయ వేడి రాజుకుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని నిరసిస్తూ బీజేపీ పిలుపునిచ్చిన ‘చండూర్ బంద్’ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. పట్టణ ప్రజలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించి సంఘీభావం తెలపడం విశేషం.
నిందితులను అరెస్ట్ చేయాల్సిందే!
బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగ బీజేపీ నేతలు అభివర్ణించారు. ఈ సందర్భంగా వారు ప్రధానంగా మూడు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచారు:
- దాడికి పాల్పడిన కాంగ్రెస్ నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
- వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి.
- ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి.
ఖబడ్దార్ కాంగ్రెస్ నేతలకు.. డా. నాగం వర్షిత్ రెడ్డి హెచ్చరిక
నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
“బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఉరికించి కొడతాం.. ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకులారా! మీ అరాచక పాలన చూసి ప్రజలు విసిగిపోయారు. మంత్రి పదవిపై ఉన్న దృష్టి ప్రజల సమస్యల మీద లేదని చండూర్ ప్రజలు గమనిస్తున్నారు.” అని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ తుల వీరేందర్ గౌడ్, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని, ప్రజాస్వామ్యం కోసం చివరి వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో కక్షసాధింపులు ప్రజాస్వామ్యానికే గండం
నల్లగొండ జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి, కానీ భౌతిక దాడుల వరకు వెళ్లడం శోచనీయం. అధికార పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించకపోతే అది ప్రభుత్వ ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది. అదే సమయంలో, ప్రతిపక్షాలు కూడా శాంతియుత నిరసనల ద్వారానే ప్రజల మద్దతు కూడగట్టాలి. పోలీసులు పక్షపాతం లేకుండా విచారణ జరిపి అసలైన దోషులను శిక్షించినప్పుడే ఇలాంటి ‘బంద్’ల అవసరం ఉండదు.