- పార్టీ మారిన కేడర్కు మాజీ ఎమ్మెల్యేల ఆహ్వానం
- మున్సిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ
- చైర్మన్ పదవితో సహా, కౌన్సిలర్ సీటు ఆఫర్
- అవసరమైతే ఎన్నికల ఖర్చులు కూడా భరిస్తామని హామీ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీల గుర్తులతో జరుగుతున్న ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతోంది. కారు పార్టీలో చేరితే చైర్మన్ పదవి తో సహా, కౌన్సిలర్ టికెట్ కూడా ఇస్తామని ఆఫర్ ప్రకటిస్తున్నారు. అంతేగాక బలమైన లీడర్లు ఎవరైనా వస్తే ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తామని హామీ ఇస్తున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవ రకొండ, కోదాడ, భువనగిరి, హుజూర్నగర్, సూర్యాపేట మున్సిపాలిటీల్లో ఈ తరహా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ లో మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు కొడుకు సిద్ధార్థ కాంగ్రెస్ పార్టీకి ఝలక్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ వార్డు ఇన్చార్జిలను బీఆర్ఎస్ లోకి చేర్చుకునే కార్యక్రమాన్ని స్పీడప్ చేశారు. అంతేగాక మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపుకు అవసరమైతే ఆస్తులైనా అమ్ముకుంటాం గానీ, పదవులు వేలం పాట పెట్టమని కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో మిర్యాలగూడ కాంగ్రెస్లో గుబులు మొదలైంది. మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.

ఈసారి చైర్మన్ సీటు జనరల్కు రిజర్వేషన్ అయితే రెడ్డి సామాజికవర్గాన్ని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. సీనియర్ నేత అల్గుబెల్లి అమరేందర్ రెడ్డి తెరవెనక చక్రం తిప్పుతున్నారు. ఆయనతో పట్టణానికి చెందిన పలువురు నేతలు హైదరాబాద్ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. భార్గవ్ను పార్టీలో చేర్చుకోవడం అప్పట్లో ఎమ్మెల్యేకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ సీనియర్ల అండతో ఏదో విధంగా సర్ధుకుపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ అవకాశం రాకపోయినప్పటికీ తన వర్గానికి కౌన్సిలర్ టికెట్లు ఇప్పించుకోవడంలో భార్గవ్ ఎంతమేరకు సక్సెస్ అవుతారనేది ఇప్పటికైతే ప్రశ్నార్ధకమే. పార్టీ మారొచ్చిన నేతలతో కాంగ్రెస్ కేడర్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక వేళ వలస నేతలకు కాంగ్రెస్లో కౌన్సిలర్ టికెట్ ఇవ్వకుంటే వారందరిని తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు డోర్లు ఓపెన్ చేశారు. భేషజాలను పక్కనపెట్టి పార్టీలోకీ రావాలని భావిస్తే నిరభ్యంతరంగా చేర్చుకుంటామని, కౌన్సిలర్ టికెట్లు కూడా ఇస్తామని ఆఫర్ ప్రకటించారు.
అర్బన్ లీడర్లకు ఇదే ఆఖరు..
అర్బన్ లీడర్లకు మున్సిపల్ ఎన్నికలతోనే పొలిటికల్ కేరీర్ ముడిపడి ఉంటుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తరహాలో ఒక చోట మిస్సైతే మరొక చోట అవకాశం లభిస్తుందనే నమ్మకం మున్సిపాలిటీలో ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్లోని వలస నేతలకు బెంగ పట్టుకుంది. మొదటి నుంచి పార్టీనే నమ్ముకున్న కేడర్కు కౌన్సిలర్ టికెట్లు ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ఇప్పటికే తీర్మానించింది. ఆ మేరకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు సంకేతాలు కూడా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినవారే. కానీ ఇప్పుడు వాళ్లలో ఎంత మందికి టికెట్ లభిస్తుందనే నమ్మకం లేదు. ఒక వేళ రిజర్వేషన్లు తారుమారైతే తమ కుటుంబ సభ్యులను పోటీలో దింపేందుకు వెనకాడమని చెప్తున్నారు. ఎటొచ్చి కాంగ్రెస్లో టికెట్ల లొల్లి తీవ్రంగానే కనిపిస్తోంది. దీన్నే అదునుగా భావించిన మాజీ ఎమ్మెల్యేలు అవకాశం కోసం కాసుకూర్చున్నారు. బలమైన అభ్యర్థులు లేనందున కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కేడర్ మళ్లీ యూటర్న్ తీసుకొని వస్తే చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు.

గ్రూపు గొడవలతోనే చిక్కు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆతర్వాత చాలా మంది కౌన్సిలర్లు, చైర్మన్లు కాంగ్రెస్లో చేరారు. వీళ్లలో ముఖ్యనేతల అనుచరులు కూడా ఉన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు, చైర్మన్లు నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నందికొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్లో చేరారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వర్గం కాంగ్రెస్లో చేరగా, మరికొందరు సొంత కుంపటి పెట్టుకున్నారు. నల్లగొండలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో సహా, అనేక మంది కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. మిర్యాలగూడలో చైర్మన్ తిరునగరు భార్గవ్, హుజూర్నగర్, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పుల్లో చైర్మన్లు, కౌన్సిలర్లు బీఆర్ఎస్లో పదవులు పొంది, కాంగ్రెస్లో చేరారు. అప్పుడన్న ఎమ్మెల్యేలతో గొడవలు, మనస్పర్థలు, ఒత్తిళ్లు భరించలేకపోయారు. దీన్నే అదునుగా భావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు కోసం పార్టీలో చేర్పించుకున్నారు. కానీ ఇప్పుడు అదే సమస్యగా మారుతోంది.