- జనరల్ అయితే మాజీ కే ఛాన్స్ అంటున్న పార్టీ వర్గాలు,
- బీసీ, ఎస్సీ లకు అయితే మాత్రం పోటీ అనివార్యం
- యధావిధిగానే ఎన్నికలు, రిజర్వేషన్లో మార్పులు వార్డుల పెంపు లేనట్టే
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నీలగిరి కార్పోరేషన్కు తొలి మేయర్ ఎవరు అవుతారనే దాని పైన కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ ఎన్నికల్లో కార్పోరేషన్ కాదనే అభిప్రాయంతో ఉన్న పార్టీ కేడర్కు మంగళవారం అసెంబ్లీలో ప్రకటన వెలువడటంతో ఒక్కసారిగా నల్లగొండలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్సీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. కార్పోరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. అంతేగాక బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పించారు. మొన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ ఈసారి బీసీ లేదా ఎస్సీలకు అయ్యే అవకాశం ఉంటదని చర్చ జరిగింది. కానీ ఇప్పుడు కార్పోరేషన్గా మారడంతో అంచనాలు మారిపోతున్నాయి.
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల తరహాలోనే నల్లగొండ కార్పోరేషన్ కి కూడా ఎన్నికలు జరుగుతాయని, షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆఫీసర్లు చెపుతున్నారు. అంతేగాక వార్డుల సంఖ్య కూడా పెరగదని, 48 వార్డులు యధావిధిగా ఉంటాయని, కాకపోతే వార్డుల బదులు డివిజన్లు అని పిలుస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఓటరు జాబితా ప్రక్రియ యాథతధంగా కొనసాగుతుందని ఆఫీసర్లు చెప్పారు.
మేయర్ పీఠం పైన ఆశలు…
నల్లగొండ మున్సిపాలిటీ ఇప్పటికే అనేక సార్లు జనరల్ రిజర్వేషన్ అయ్యింది. కావున ఈసారి బీసీ లేదా ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉందని భావించారు. కానీ కార్పోరేషన్గా మారడంతో రొటేషన్ సిస్టమ్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉంటుంది. పైగా తొలిసారి కార్పోరేషన్ హోదాలో ఎన్నికలు జరుగుతున్న నీలగిరి మేయర్ పీఠం జనరల్ రిజర్వు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ జనరల్ అయితే మాత్రం తొలి మేయర్గా మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీ నివాస్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏడాది కాలం పాటు చైర్మన్గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి మున్సిపాల్టీ పైన పట్టుసాధించారు. ఇప్పటకే అనేక దఫాలుగా కౌన్సిలర్గా ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో ఆయన సతీమణి చైతన్య కూడా చైర్మన్గా గెలిచారు. అంతేగాక 20 వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించడంలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పూర్తి సహకారం అందించారు.

ఒకవేళ బీసీ, ఎస్సీ లకు రిజర్వు చేస్తే కాంగ్రెస్తో పాటు, బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు సైతం గట్టిగానే పోటీ పడే పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి పిల్లిరామరాజు యాదవ్ ఇప్పటికే భారీ ఫ్లెక్సీలతో పట్టణంలో సందడి చేస్తున్నారు. అన్ని డివిజన్లో అభ్యర్థులను నిలబెట్టడమేగాక, ఎన్నికల ఖర్చు సైతం వెనక్కి తగ్గొద్దనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది.