- మూడో విడతలో హుజూర్నగర్, దేవరకొండ,
- యాదాద్రి జిల్లాలో మిగిలిన ఆరు మండలాల్లో పోలింగ్
- హుజూర్నగర్లో అత్యధికంగా 22 జీపీలు ఏకగ్రీవం
- సర్పంచ్ పదవి కోసం అభ్యర్థుల పోటాపోటీ
- చివరి పోరులో మెజార్టీ స్థానాల కోసం ఎమ్మెల్యేల పట్టు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి ఇలాకా హుజూర్నగర్ పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడో విడతలో దేవరకొండ నియోజకవర్గంతోపాటు, మునుగోడు, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో మిగిలిన చౌటుప్పుల్, సంస్థాన్ నారాయాణ్ పూర్, అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల,మోటకొండూరు మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు విడతల్లో ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందినట్టు కనిపిస్తున్నా…చాలా మండలాల్లో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఇలాకాలో సైతం బీఆర్ఎస్ 26 పంచాయతీల్లో గెలిచింది. 88 స్థానాలకు ఎన్నికలు జరిగితే 64 చోట్ల కాంగ్రెస్ సపోర్టర్స్ గెలుపొందారు. ఐదు గ్రామాలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి.
హుజూర్నగర్లోనే మంత్రి మకాం..
గతకొద్ది రోజుల నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్లో మకాం పెట్టి పార్టీ కేడర్కు భరోసా ఇస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 22 జీపీలు ఏకగ్రీవం కాగా, 124 జీపీలకు, 1061 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 769 మంది అభ్యర్థు లు బరిలో ఉన్నారు. ఈ లెక్కన సగటున ఒక్కో గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్తోపాటు, రెబల్స్ గట్టిపోటీ ఇస్తున్నారు. మేళ్లచెర్వు, మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల మండల పంచాయతీల్లో రసవత్తర పోరు జరుగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున గట్టిగా నిలబడే నాయకుడు లేకపోవడం ఆపార్టీకి అది పెద్ద మైనస్. కాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆడదడపా మాత్రమే ఆయా మండలాల్లో పర్యటించారు. పార్టీ నేత ఒంటెద్దు నర్సింహారెడ్డి సమన్వయకర్తగా పనిచేసినప్పటికీ క్యాండేట్లు ఒంటరిగానే పోరాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు గట్టిగా ప్రచారం చేసిన చోట బీఆర్ఎస్ మెజార్టీ పంచాయతీలు కైవసం చేసుకుంది. కానీ ఇక్కడ ఆపార్టీ ఒంటిరి కావడంతో హుజూర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుస్తారనే చర్చ నడుస్తోంది. దేవరకొండలో సైతం ఎమ్మెల్యే బాలూనాయక్ సర్పంచ్ ఎ న్నికలను సీరియస్గా తీసుకున్నారు. బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వకుండా అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి ఎమ్మెల్యేలు చివరి పోరులో మరిన్ని పంచాయతీలను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. రెండు విడ తల్లో మూడు చోట్ల బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. సొంతపార్టీలో రెబల్స్ వల్ల పార్టీ అభ్యర్థులకు తీరని నష్టం జరిగింది.
జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు…
దేవరకొండ డివిజన్లో 9 మండలాల పరిధిలోని 269 పంచాయతీల్లో 42 ఏకగ్రీవంకాగా, 227 జీపీలకు, 2,206 వార్డుల్లో 603 వార్డులు ఏకగ్రీవంకాగా 1603 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 720 మంది సర్పంచ్ అభ్యర్థులు, 4,299 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. ఈ డివిజన్లో మొత్తం ఓటర్లు 2,60,316 మందికి ఉండగా, పురుషులు 1,30,187, మహిళలు 1,30,109, ఇతరులు 20 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు 1610 ఏర్పాటు చేశారు. 89 మంది అభ్జర్వర్లు విధుల్లో ఉండగా, 236 జీపీల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. 661 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. 2,647 బ్యాలెట్ బాక్సు లు, 227 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సూర్యాపేట డివిజన్లో 7 మండలాల పరిధిలోని 146 పంచాయతీల్లో 22 ఏకగ్రీవంకాగా, 124 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 1318 వార్డుల్లో 257 ఏకగ్రీవం కాగా, 1061 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 769 మంది సర్పంచ్ క్యాండేట్లు, 3,316 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. 1176 పోలింగ్ స్టేషన్లు, 12 94 బ్యాలెట్ బాక్సులు, 129 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 1,92,617 మందిలో పురుషులు 93,658, మహిళలు 98,952, ఇతరులు 7 గురు ఉన్నారు.
యాదాద్రి జిల్లాలో 6 మండలాల్లో 124 పంచాయతీల్లో 10 ఏకగ్రీవం కాగా, 114 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 338 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1086 వార్డుల్లో 93 ఏకగ్రీవం కాగా, 993 మంది పోటీలో ఉన్నారు. 2,395 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 45 ఉన్నాయి. 36 మంది మైక్రోఅభ్జర్వర్లు, 49 మంది వెబ్కాస్టింగ్ సిబ్బందిని నియమించా రు.
ఎన్నికలు జరిగే స్థానాల వివరాలు…
| జిల్లాపేరు | సర్పంచ్ స్థానాలు | వార్డుస్థానాలు | ఓటర్లు |
| నల్లగొండ | 227 | 1603 | 2,60,316 |
| సూర్యాపేట | 124 | 1061 | 1,92,617 |
| యాదాద్రి | 114 | 993 | 1,59,289 |